Thursday, June 12, 2025
E-PAPER
Homeజాతీయంఏం సాధించారు?

ఏం సాధించారు?

- Advertisement -

– సందర్శనలు… సమావేశాలు… విందులతో సరి
– ప్రారంభోత్సవాలు, ఆవిష్కరణలు కూడా…
– ప్రపంచ దేశాలను మెప్పించడంలో వైఫల్యం
– విమర్శలకు దారితీసిన ఎంపీల విదేశీ పర్యటనల తీరు

ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత ఉగ్రవాదంపై భారత్‌ వైఖరిని తెలియజేయడానికి, పాక్‌ దుర్నీతిని ఎండగట్టడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం దౌత్యవేత్తలు, అఖిలపక్ష ఎంపీలతో కూడిన ఏడు బృందాలను 33 దేశాలకు పంపిన విషయం తెలిసిందే. వారంతా ఆయా దేశాల్లో పర్యటించి భారత్‌ చేరుకున్నారు. ఈ బృందాలు పర్యటించిన కనీసం పాతిక దేశాల్లో ప్రవాస భారతీయ సభ్యులను కలుసుకోవడానికి చాలా సమయాన్నే వెచ్చించాల్సి వచ్చింది. ఈ పర్యటనలు సాంస్కృతిక, రాజకీయ ప్రచారంలా సాగాయి. పాకిస్తాన్‌ను అంతర్జాతీయంగా దూరం చేయడానికి ఇవి ఉపకరించాయా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.
న్యూఢిల్లీ : ప్రతినిధి బృందాల్లోని సభ్యులు తమ వాక్చాతుర్యంతో ఆయా దేశాల వారిని మెప్పించే ప్రయత్నం చేశారు. వారంతా తరచూ బీజేపీ హిందూత్వ భావజాలంతోనే ప్రసంగాలు చేశారు. ఈ పర్యటనలపై మీడియా పెద్దగా దృష్టి సారించలేదనే చెప్పాలి. పర్యాటక ప్రాంతాల సందర్శన, ప్రముఖులతో ఇంటర్వ్యూలు, విందు కార్యక్రమాల్లో పాటలు పాడడం, గర్బా ప్రదర్శనలు తిలకించడంతోనే సభ్యుల సమయం గడిచిపోయింది. భారత్‌ వైఖరిని చాటిచెప్పి ప్రపంచ దేశాలను మెప్పించడంలో ప్రతినిధి బృందాలు విఫలమయ్యాయన్న విమర్శలు వస్తున్నాయి.
సమాజాలతో భేటీలు
ఓ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన జేడీయూ ఎంపీ సంజరు కుమార్‌ ఝా సియోల్‌లో యూట్యూబర్‌ లీ యెచాన్‌ను కలిశారు. సామాజిక మాధ్యమంలో ‘కొరియన్‌ బిహారీ’గా ఆయన సుప్రసిద్ధుడు. లీ యెచాన్‌తో భేటీ సందర్భంగా సంజరు కుమార్‌ ఓ వీడియో తీసుకున్నారు. లీ యెచాన్‌ పాట్నాలో పెరిగాడని గుర్తుచేశారు. ఇదే ప్రతినిధి బృందంలోని బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి జకార్తాలోని భారత ఎంబసీలో బిజూ హాల్‌ను ప్రారంభించారు. అక్కడే ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్‌ స్మారక ఫలకాన్ని ఆవిష్కరించారు. ఒడియా సమాజ సభ్యులనూ కలిశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ జకార్తాలో బెంగాల్‌ అసోసియేషన్‌ సభ్యులతో ముచ్చటించారు. జపాన్‌ పర్యటనలో భాగంగా టోక్యోలో ఉన్నప్పుడు స్వాతంత్య్ర సమరయోధుడు రష్‌బెహారీ బోస్‌ స్మారక చిహ్నాన్ని ఇతర సభ్యులతో కలిసి సందర్శించారు. డీఎంకే సభ్యురాలు కనిమొళి స్పెయిన్‌లో తమిళులను కలిశారు.
సందర్శనలతో బిజీ బిజీ
భారత్‌ వైఖరిని వెల్లడించడానికి సమయం దొరికిందా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవడానికి మాత్రం బాగానే సమయం చిక్కింది. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ పనామాలో సాంస్కృతిక ప్రదర్శనను తిలకించారు. ఆ చిత్రాలను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. బీజేపీ ఎంపీ రేఖా శర్మ అల్జీరియాలో జరిగిన ఓ విందులో పాటలు పాడారు. దీనిపై విమర్శలు వచ్చినప్పటికీ ఆమె వాటిని తోసిపుచ్చారు. కాగా ప్రతినిధి బృందాల్లోని సభ్యులు అనేక పర్యాటక ప్రదేశాలను తిలకించి సంబరపడ్డారు. ఉదాహరణకు అల్జీరియాలోని అల్జీర్స్‌లో స్మశానవాటికను సందర్శించారు. ఆధునిక అల్జీరియా రూపకర్త ఎమిర్‌ అబ్డేల్‌కదార్‌ సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచారు. అల్జీర్స్‌లో పహల్గాం మృతుల జ్ఞాపకార్థం కొవ్వొత్తులు వెలిగించారు. మద్జాహిద్‌ జాతీయ మ్యూజియం అయిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని సందర్శించారు. సౌదీ అరేబియాలో యునెస్కో వారసత్వ సంపద అయిన దిరియాను తిలకించారు. బహ్రెయిన్‌లో ప్రముఖ చారిత్రక మైలురాయి అయిన బాబా అల్‌ బహ్రెయిన్‌ను వీక్షించారు. మలేషియాలోని కౌలాలంపూర్‌లో రామకృష్ణ మిషన్‌ను ప్రతినిధి బృందం సభ్యులు సందర్శించారు. బ్రిక్‌ఫీల్డ్స్‌లో నేతాజీకి నివాళులర్పించారు. 2015లో భారత్‌ బహుమతిగా ఇచ్చిన టోరానా గేట్‌ వద్దకు కూడా వెళ్లారు. థరూర్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం పనామా కాలువను సందర్శించింది. మరో ప్రతినిధి బృందం బ్రిటన్‌లో అంబేద్కర్‌ మ్యూజియంను చూసింది. ఈజిప్ట్‌ వెళ్లిన ఎంపీలు వార్‌ మెమోరియల్‌ను సందర్శించారు. అబూదాబీలో మసీదును, హిందూ దేవాలయాన్ని, గురుద్వారాను చూశారు.
డయాస్పొరాల్లో…
వివిధ దేశాల్లో భారతీయులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎంపీలు ఉర్రూతలూగించే ప్రసంగాలు చేస్తూ హర్షధ్వానాలు అందుకున్నారు. ఖతార్‌, కువైట్‌, స్లొవేనియా, కాంగో, గ్రీస్‌, ఇటలీ, ఇండోనేసియా, గయానా, సౌదీ అరేబియా, అల్జీరియా, బ్రిటన్‌, బ్రస్సెల్స్‌, డెన్మార్క్‌, మలేసియా, దక్షిణ కొరియా, యూఏఈ, లైబీరియా, సియెర్రా లియోన్‌, పనామా, కొలంబియా, అమెరికా, స్పెయిన్‌, జర్మనీ, లాట్వియా, ఇథియోపియా సహా పలు దేశాల్లో డయాస్పొరాలు జరిగాయి. పలు చోట్ల ప్రతినిధులు హిందీలో ప్రసంగించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -