బీఆర్ఎస్ నాయకులు గంజి కృష్ణ
నవతెలంగాణ – మిడ్జిల్
పార్లమెంట్ సమావేశంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య లోక్సభలో చేసిన తెలంగాణపై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు గంజి కృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో ఖండించారు. తెలంగాణ విభజనను భారత్ పాకిస్తాన్ తో విభజనతో పోల్చడం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్య అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఎవరి భిక్ష వల్ల ఏర్పడినది కాదని, వేలాది మంది యువకుల త్యాగాలు, సుదీర్ఘ ప్రజాస్వామ్య పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. ఒక ప్రజాస్వామ్య పోరాటాన్ని దేశ విభజన వంటి విషాదకర సంఘటనతో పోల్చడం అనేది అహంకారానికి నిదర్శనమని విమర్శించారు.
పార్లమెంట్ వేదికగా తెలంగాణను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, తేజస్వి సూర్య వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని గంజి కృష్ణ డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన ఎంపీలు రాష్ట్ర గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని, ఇటువంటి సందర్భాల్లో మౌనం పాటించడం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అనేది ఒక త్యాగాల గాథ అని, స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన ఈ గడ్డను అవమానిస్తే తెలంగాణ సమాజం ఊరుకోదని హెచ్చరించారు.
రాష్ట్ర హక్కులు, గౌరవం కోసం భారత్ రాష్ట్ర సమితి ఎల్లప్పుడూ ప్రజల తరఫున పోరాడుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని విమర్శిస్తే రాబోవు రోజుల్లో బిజెపి నాయకులకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని స్పష్టం చేశారు.



