ఐఎపి నుంచి వైదొలిగిన హైదరాబాదీ డాక్టర్
న్యూఢిల్లీ : నకిలీ ఓఆర్ఎస్పైనా, ఓఆర్ఎస్ పానీయం కాకపోయినా కొన్ని ప్రముఖ బ్రాండ్లు ఓఆర్ఎస్ అనే పదాన్ని ఉపయోగించడంపై అలుపెరుగని పోరాటం చేస్తున్న హైదరాబాద్కు చెందిన ప్రముఖ శిశువైద్యులు డాక్టర్ శివరంజని సంతోష్ తాజాగా తీసుకొన్న మరొక నిర్ణయం సంచలనంగా మారింది. నకిలీ ఓఆర్ఎస్పై తన పోరాటానికి మద్దతు ఇవ్వకపోవడంతో పాటు, ఈ వివాదంలో ఒక సంస్థకు సహాయం చేసిందని విమర్శసిస్తూ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఎపి) నుంచి డాక్టర్ శివరంజని సంతోష్ వైదొలిగారు. ‘కెన్వ్యూ డ్రింక్ కొత్త బ్రాండింగ్ పాతదానిని పోలి ఉండటం, అది ఓఆర్ఎస్ అనే పేరును ఉపయోగించడంపై నేను అభ్యంతరాలు వ్యక్తం చేసిన తరువాత.. ఆ కంపెనీ ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో అది తమ పానీయాలన్నింటికీ శాస్త్రీయ ఆధారం ఉందని పేర్కొంది. పైగా ఐఎపి నిర్వహించిన పెడికాన్ అనే సదస్సులో కూడా దీనిపై నివేదికను సమర్పించారు’ అని శివరంజనీ సంతోష్ మీడియాకు తెలిపారు. అలాగే, ఓఆర్ఎస్పై ఐఎపి జారీ చేసిన ప్రకటన గందరగోళంగా ఉందని ఆమె విమర్శించారు. ఐఎపి ప్రకటన పోషక విలువలు లేని తీపి పదార్థాలు (ఆస్పార్టేమ్, శాకరిన్, స్టీవియా వంటి కృత్రిమ తీపి పదార్థాలు) గురించి ప్రస్తావించలేదని, ముఖ్యంగా కెన్వ్యూ తన కొత్త ఉత్పత్తిలో ఉపయోగించిన సుక్రలోజ్ గురించి ప్రస్తావించలేదని డాక్టర్ శివరంజని స్పష్టం చేశారు. ఒకవేళ కెన్వ్యూ తన పోరాటంపై పరువు నష్టంపై దావా వేయాలనుకుంటే ఐఎపి డాక్యుమెంట్ను ఆ కంపెనీ ఉపయోగించుకునే అవకాశం ఉందని ఆమె తెలిపారు. ఐఎపి అధ్యక్షులు డాక్టర్ నీలం మోహన్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తనకు సమాధానం రాలేదని శివరంజనీ తెలిపారు. అందుకే ఐఎపి నుంచి వైదొలగినట్లు చెప్పారు.
నకిలీ ఓఆర్ఎస్పై అలుపెరుగని పోరాటం
- Advertisement -
- Advertisement -



