అద్యక్ష కార్యదర్శులుగా సంకుర్ రావు, నాగేశ్వరరావు లు ఏకగ్రీవం
నవతెలంగాణ – అశ్వారావుపేట
సర్పంచ్ ల సంఘం అశ్వారావుపేట మండల నూతన కమిటీ ఎన్నికలు శుక్రవారం ఉట్లపల్లి పంచాయతీ పరిధిలోని కాసాని గార్డెన్స్ లో నిర్వహించారు. మండలంలోని సర్పంచ్ ల సమావేశంలో ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షుడిగా కన్నాయిగూడెం సర్పంచ్ గుజ్జా సంకుర్రావు, ప్రధాన కార్యదర్శిగా రామన్నగూడెం సర్పంచ్ మడకం నాగేశ్వరరావును ఎన్నుకున్నారు.
గౌరవ అధ్యక్షుడిగా కొత్త మామిళ్లవారి గూడెం సర్పంచ్ వగ్గెల లక్ష్మణరావు,కోశాధికారిగా తిరుమలకుంట సర్పంచ్ కొర్స రాజేష్ లు బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షులుగా గుమ్మడివల్లి సర్పంచ్ పాయం శ్రీదేవి, నారాయణపురం సర్పంచ్ మడకం కుమారి, ఉట్లపల్లి సర్పంచ్ సత్యం లక్ష్మి కుమారి ఎన్నికయ్యారు. ఇతర సభ్యులను కూడా రెండు సంవత్సరాల కాలానికి ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు గుజ్జా సంకుర్రావు, ప్రధాన కార్యదర్శి మడకం నాగేశ్వరరావు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సర్పంచ్ల కు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని సర్పంచ్ల సమస్యల పరిష్కారం కోసం కట్టుబడి పనిచేస్తామని చెప్పారు.
గ్రామ పంచాయతీల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. సర్పంచ్ లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సంఘం దృష్టికి తీసుకువస్తే తగిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
కొంతమంది కార్యదర్శులు కావాలనే సర్పంచ్ లను వేధిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, అలాంటి పరిస్థితులు కొనసాగితే సర్పంచ్ల సంఘం తరపున తీవ్ర ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.



