పడిగాపులు కాస్తున్న అన్నదాతలు
నవతెలంగాణ – బోనకల్
ఖమ్మం జిల్లా బోనకల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో శుక్రవారం నుంచి కాంటాలను బంద్ చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్టు సీఈవో అంబటి సంపత్ కుమార్ తెలిపారు. మళ్లీ ఆదేశాలు ఇచ్చే వరకు కొనుగోళ్లు చేయొద్దని ఆదేశించినట్టు చెప్పారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నలను నిల్వ చేసేందుకు అవసరమైన గోడౌన్లు లేనందున కాంటాలు నిలిపివేస్తున్నట్టు తెలిపారు. గురువారం సంచుల కొరతతో ఇద్దరు రైతుల మొక్కజొన్నలు మాత్రమే కాంటా వేశామన్నారు. బోనకల్ సొసైటీ పరిధిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఈనెల 6వ తేదీన ప్రారంభించారు. ఆ రోజు నుంచి నేటి వరకు 5వేల క్వింటాళ్లను కొనుగోలు చేసినట్టు అధికారులు తెలిపారు. వారం పది రోజుల నుంచి మొక్కజొన్నలను అధికారులు కొనుగోలు చేయకపోవడంతో రైతులు కేంద్రాల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. కాంటా వేసిన దగ్గర నుంచి దిగుమతి చేసే వరకు ఆ మొక్కజొన్నల బాధ్యత రైతుదేనని అధికారులు స్పష్టం చేయటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
వారం రోజులుగా కొనుగోలు కేంద్రంలోనే.. రైతు షేక్ నజీర్- ముష్టికుంట్ల
మూడెకరాలకు సంబంధించి మొక్కజొన్న పంటను వారం రోజుల కిందట బోనకల్ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాను. గోడౌన్ కొరత వల్ల పంట కాంటా వేయటం లేదు. మొక్కజొన్నలను కొనుగోలు చేయకపోవడంతో ప్రతిరోజూ ఇక్కడే పడిగాపులు కాయాల్సి వస్తోంది.
గోడౌన్ల కొరతతో మొక్కజొన్న కొనుగోళ్లు బంద్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



