63 చెల్లిబాటు..6 తిరస్కరణ : కలెక్టర్

– 13 వరకు ఉపసంహరణకు గడువు
– 4.63 లక్షల ఓటర్లు
– 27న బ్యాలెట్ పేపర్ ద్వారా పోలింగ్
– జూన్ 5న కౌంటింగ్ 
– జిల్లా ఎన్నికల అధికారి హరిచందన దాసరి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
వరంగల్,ఖమ్మం,నల్గొండ  పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికకు ఈనెల 2న నుండి 9 వరకు నామినేషన్ల స్వీకరణ జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హరిచందన  దాసరి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొత్తం 69 మంది అభ్యర్థులు 117 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించగా, శుక్రవారం నామినేషన్ల పరిశీలనలో  ఆరుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించామన్నారు.  ఈ నెల 13 న  3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని, శని, ఆదివారాలు సెలవు దినాలై నందున నామినేషన్ల ఉపసంహరణ దరఖాస్తులు స్వీకరించడం జరగదని స్పష్టం చేశారు. ఈనెల 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉంటుందని తెలిపారు. వరంగల్,ఖమ్మం,నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం 12 జిల్లాలలో విస్తరించి ఉందని తెలిపారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఈ ఎన్నిక జరుగుతుందని, మొత్తం 4.63 లక్షల ఓటర్లు 605 పోలింగ్ స్టేషన్లలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటారని  తెలిపారు. నల్గొండ శివారులోని అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఉన్న రాష్ట్ర గిడ్డంగుల శాఖ గోదాములో  జూన్ 5న కౌంటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ములుగు రెవెన్యూ ఆదనపు కలెక్టర్, శాసన మండలి పట్టబద్రుల సహాయ  రిటర్నింగ్ అధికారి సిహెచ్. మహేందర్ జి, ఏ ఆర్ ఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, పార్లమెంట్ ఎన్నికల డిప్యూటీ రిటర్నింగ్ ఆఫీసర్ స్పెషల్ కలెక్టర్ నటరాజ్, సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ యు.వెంకటేశ్వర్లు,మీడియా నోడల్ అధికారి ఇండస్ట్రీస్ జిఎం.  కోటేశ్వర రావు పాల్గొన్నారు.
Spread the love