నవతెలంగాణ- హైదరాబాద్: నాగర్ కర్నూలు జిల్లాలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీసులు మీడియాకు వెల్లడించారు. శ్రీపురం గ్రామంలో జరిగిన ఈ హత్య కేసు వివరాల్లోకి వెళితే.. శ్రీపురం గ్రామానికి చెందిన 35 ఏళ్ల రాములు ప్లంబర్గా పనిచేస్తూ భార్య మానస, ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు. ఆరు నెలల క్రితం వీరి ఇంట్లో బంగారం చోరీకి గురికావడంతో, పెద్ద ముద్దునూరు గ్రామానికి చెందిన మంత్రగాడు సురేశ్ గౌడ్ వద్దకు వెళ్లారు.
ఆ సమయంలో సురేశ్తో మానసకు పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. సురేశ్తో తన సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించిన మానస, భర్తను అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఈ నెల 8న బంధువుల పెళ్లి ఉందని చెప్పి వెళ్ళింది. ఆ సమయంలోనే భర్తను హత్య చేయాలని పథకం వేసింది. సురేశ్ డెయిరీ ఫామ్ కూడా నిర్వహిస్తున్నాడు. మానస భర్తను హత్య చేసేందుకు తన వద్ద పనిచేసే ఇద్దరితో సురేశ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముగ్గురు కలిసి రాములును పెద్ద ముద్దునూరుకు రప్పించారు. పథకం ప్రకారం అతనికి ఎక్కువ మద్యం తాగించి స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం నోరు, ముక్కుకి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేసి హతమార్చారు. రాములు ఒంటిపై గాయాలు చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని ప్రయత్నించారు.
అనంతరం మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి వెళ్ళారు. మృతదేహాన్ని చూసిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తన కొడుకు మృతిపై అనుమానం వచ్చిన రాములు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోడలు వివాహేతర సంబంధం, ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి పోలీసులకు తెలియజేశాడు. దీంతో పోలీసులు సురేశ్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.