నవతెలంగాణ-హైదరాబాద్ : సామాజిక సర్వేపై ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి దంపతుల కామెంట్స్పై కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది వెనుకబడిన కులాల సర్వే కాదని 20 సార్లు చెప్పాం. వారికి అర్థం కాకపోతే నేనేం చేయాలి. ఇన్ఫోసిస్ ఉందని వారికి అన్నీ తెలుసనుకుంటున్నారా? ఇది పూర్తిగా పాపులేషన్ సర్వే. మరి కేంద్రం చేపడుతున్న సర్వేపై ఏమంటారు?’ అని ప్రశ్నించారు. అటు సర్వేపై ఎవరినీ బలవంతం చేయమని డిప్యూటి సీఎం శివకుమార్ అన్నారు.
సామాజిక, ఆర్థిక, విద్యా వివరాల సేకరణ కోసం కర్ణాటక ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న సర్వేను ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతులు తిరస్కరించిన విషయం తెలిసిందే. సర్వే సిబ్బంది ఇటీవల బెంగళూరులోని నారాయణమూర్తి నివాసానికి వెళ్లగా, ఆ కుటుంబ సభ్యులు వివరాలిచ్చేందుకు నిరాకరించినట్లు గ్రేటర్ బెంగళూరు అథార్టీ అధికార వర్గాలు వెల్లడించాయి. ‘మాది వెనుకబడిన వర్గాలకు చెందిన కుటుంబం కాదు. ఈ సమీక్షలో పాల్గొనటం వల్ల కమిషన్కు, ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం చేకూరదు’ అని సుధామూర్తి వివరణ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.