నవతెలంగాణ – హైదరాబాద్ : చిత్తూరు జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారక ఘటన చిత్తూరు రూరల్ మండలం, బంగారెడ్డిపల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది. భార్య అనారోగ్యాన్ని తట్టుకోలేక భర్త ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. మృతులను దామోదర్, ఆయన భార్య నిర్మల, కుమారుడు దిలీప్ (8వ తరగతి), కుమార్తె శ్రీవిద్య (6వ తరగతి)గా పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా నిర్మల తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో, ఆమె పరిస్థితిని చూడలేకపోయిన దామోదర్.. భార్యకు, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, ఆపై తానూ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఘటనా స్థలంలో లభించిన ఆత్మహత్య లేఖలో, తమ మరణానికి ఎవరూ బాధ్యులు కాదని దామోదర్ పేర్కొన్నారు. అంత్యక్రియల ఖర్చుల కోసం ఏటీఎం కార్డుల్లో నగదు ఉందని, వాటిని వినియోగించుకోవాలని ఆయన ఆ లేఖలో కోరడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. సమాచారం అందుకున్న చిత్తూరు రూరల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



