నవతెలంగాణ-హైదరాబాద్: పర్యాటక, వ్యాపార వీసాల విషయంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ హయాంలో 50 దేశాలకు చెందిన బి-1 (వ్యాపారం), బి-2 (పర్యాటకం) వీసా దరఖాస్తుదారులపై శాశ్వత వీసా బాండ్ ప్రోగ్రామ్ అమలు చేయనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ కొత్త విధానం ప్రకారం …. ఎంపిక చేసిన దేశాలకు చెందిన సందర్శకులు గరిష్ఠంగా 20 వేల డాలర్ల వరకు బాండ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
మొదట ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ పథకాన్ని ఇప్పుడు కొన్ని మార్పులతో శాశ్వతంగా అమలు చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త నిబంధనలు 2026 ఆగస్టు 3 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ బాండ్ విధానం ప్రకారం …. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో అక్రమంగా ఉండిపోయే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని అధికారులు గుర్తించారు. దీంతో దీనిని కొనసాగించాలని నిర్ణయించారు. ఫెడరల్ రిజిస్టర్లో విడుదలైన నోటీసు ప్రకారం …. పైలట్ ప్రాజెక్ట్లో బాండ్ మొత్తాలను 5 వేల, 10 వేల, 15 వేల డాలర్లుగా నిర్ణయించారు. అయితే తుది నిబంధనల్లో 5 వేల డాలర్ల ఎంపికను తొలగించి, గరిష్ఠ పరిమితిని 20 వేల డాలర్లకు పెంచారు.
ఎవరికి వర్తిస్తాయంటే ?
వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఎక్కువగా ఉండిపోయే (ఓవర్స్టే) రేటు అధికంగా ఉన్న 50 దేశాల పౌరులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ జాబితాలో ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా ప్రాంతాలకు చెందిన దేశాలు ఉన్నాయి. భారత్ ఈ జాబితాలో లేకపోవడం భారతీయులకు ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు.



