నవతెలంగాణ-హైదరాబాద్: ప్రజల హక్కుల కోసం మహాత్మాగాంధీలాంటి పోరాటం చేస్తున్నామని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కతిహార్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు.
‘‘ప్రస్తుతం మహాత్మాగాంధీ పోరాడిన హక్కులు ప్రమాదంలో ఉన్నాయి. అత్యంత ముఖ్యమైన హక్కుల్లో ఓటు హక్కు ఒకటి. ప్రస్తుతం దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతోంది. ఓట్ల దొంగతనం కోసం పౌరుల హక్కులను కాలరాస్తున్నారు. రాజ్యాంగాన్ని బలహీనపరిచేలా బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ, మహాఘట్బంధన్ పోరాడుతున్న పోరాటం.. అప్పట్లో మహాత్మాగాంధీ పోరాడిన యుద్ధం లాంటిదే. నేటికీ మీ హక్కుల కోసం, సత్యం కోసం, ఒక సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం.. అది నరేంద్ర మోడీ సామ్రాజ్యం. ప్రజలను అణచివేస్తూ దేశాన్ని నడుపుతున్నారు.’’ అని ప్రియాంకాగాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు.
బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల తొలి విడత పోలింగ్ నవంబర్ 6న ముగిసింది. 121 స్థానాల్లో 65.08 శాతం పోలింగ్ నమోదైంది. ఇక రెండో విడత పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. 14న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.



