నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ లోని ఎర్రకోట సమీపంలో సోమవారం రాత్రి జరిగిన పేలుడుకు సంబంధించిన కేసులో అరెస్టైన నిందితులతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ లోని అల్ ఫలా యూనివర్సిటీ స్పష్టంచేసింది. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ భూపిందర్ కౌర్ ఆనంద్ పేరిట ప్రకటన విడుదల చేశారు. పేలుడు ఘటన తమను కలిచివేసిందని, ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి కలుగాలని తాము కోరుకుంటున్నామని ఆ ప్రకటనలో పేర్కొంది.
తాము 1997 నుంచి వివిధ విద్యాసంస్థలు నడుపుతున్నామని, హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ అయిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొందామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 2019 నుంచి తాము ఎంబీబీఎస్ కోర్సులు నిర్వహిస్తున్నామని, తమ దగ్గర వైద్య పట్టా అందుకున్న చాలామంది ప్రస్తుతం ప్రముఖ ఆస్పత్రుల్లో పని చేస్తున్నారని తెలిపారు.ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పేలుడు కేసులో మా యూనివర్సిటీలో పనిచేసే ఇద్దరు డాక్టర్లను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిందని, వాళ్లు తమవద్ద కేవలం అధ్యాపకులుగా పనిచేస్తున్నారని, అంతకుమించి వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు.



