అడివిసోమనపల్లి పక్కన మానేరు ఒడ్డున ఉన్న నయనగుహలకు సమీపంలో ఉత్తర అక్షాంశాలు 18°35’24.5”N’ తూర్పు రేఖాంశాలు 79°47μ57.5”Eలపై సముద్రమట్టానికి 836 మీ.ల ఎత్తున ఉన్న చిత్రిత శిలాశ్రయం ఎంతో ప్రత్యేకమైనది. దట్టమైన అడివిలో ఉన్నది. ఈ రాతిచిత్రాలతావును ఎడ్ల రాజేశ్ అనే యూట్యూబర్ గుర్తించాడు. కొత్త తెలంగాణచరిత్ర బృందం దం పరిశోధకుడు చొల్లేటి శ్రీనివాస్ ఈ తావున ఉన్న రాతిచిత్రాలను పరిశీలించాడు.
చిన్న కొండపై ఉన్న చిన్న రాతి చిత్రాలతావులో మెసోలిథిక్, నియోలిథిక్, మెగాలిథిక్ మరియు చారిత్రక కాలాలకు చెందిన రాతిచిత్రాలు (రాక్ ఆర్ట్) ఉన్నాయి. సంఖ్యాపరంగా తక్కువే అయినా తెలంగాణలో రాక్ ఆర్ట్ దక్కోణంలో ఇవి చాలా ముఖ్యమైనవని కొత్త తెలంగాణచరిత్రబృందం సలహాదారులు, రాతిచిత్రాల నిపుణులు డా.బండి మురళీధర్ రెడ్డిగారు, కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ అభిప్రాయపడ్డారు.
ఈ గీతలు ఎరుపు, తెలుపు, నలుపు మరియు పసుపు రంగులతో గీయబడ్డాయి. గీతల్లో చేతి ముద్రలు, నిలబడి ఉన్న మరియు కూర్చున్న మానవ ఆకృతులు, జింక, ఎద్దు, ఏనుగు, తేనెపట్టు, డైమండ్ ఆకారపు పెట్టెలు, విల్లంబు పట్టుకున్న మానవాకృతి (anthropomorphic figures) పైన బాణం, మాల ఆకారం, ‘V’ ఆకారం, త్రిశూలం, వత్తాలు, ఇతర ప్యానల్ డిజైన్లు మరియు కొన్ని జంతు ఆకృతులు ఉన్నాయి. ఎర్ర రంగులో బ్రాహ్మీ శాసనం యొక్క ఆనవాళ్లు కనిపిస్తాయి.
కొన్ని గీతలు ఒకదానిపై ఒకటి అధ్యారోపణం (uperimposed) చెంది ఉన్నాయి. మరికొన్ని అతివ్యాప్తి (overlapping) చెందాయి. రాతిచిత్రాలతావు పరిసరాల్లో కొన్ని మైక్రోలిథ్లు, కొన్ని రంగురాళ్ళు దొరికాయి.
ఈ చిత్రిత శిలాశ్రయంలోని కొన్ని ఆకృతులు తెలంగాణలోని ఒంటిగుండు, సీతమ్మలొద్ది, గుండ్లపోచంపల్లి, రత్నాపూర్ రాతిచిత్రాలతావులలోని బొమ్మలతో పోల్చదగినవి.
క్షేత్రపరిశోధన: చొల్లేటి శ్రీనివాస్,7780643771, కొ.తె.చ.బృం. సభ్యులు, యూట్యూబర్ అడ్లకొండ రాజేశ్, గైడ్ నారాయణ
నిపుణుల అభిప్రాయం: డా.బండి మురళీధర్ రెడ్డి,
శ్రీరామోజు హరగోపాల్, కొ.తె.చ.బృం.-9949498698



