నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించినట్లు భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్పై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. తనను దూషించడం, చనిపోవాలని శాపాలు పెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ విధానమని విమర్శించారు. బీఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ భేటీ తెలంగాణ భవన్లో ప్రారంభమైంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గసభ్యులతో కేసీఆర్ భేటీ అయ్యారు.
‘‘పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే బీఆర్ఎస్ సత్తా తెలిసేది. పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు బుద్ధి చెప్పారు. మేము అధికారంలో ఉన్నప్పుడు అహంకార వైఖరి ప్రదర్శించలేదు. కాంగ్రెస్ ఒక్క కొత్త పాలసీ కూడా తేలేదు. తీసుకొచ్చిన పాలసీ.. రియల్ ఎస్టేట్ కోసమే. రాష్ట్రంలో ప్రజల ఆస్తుల విలువ పూర్తిగా తగ్గింది. ఒకప్పుడు యూరియా ఇంటికి, చేను వద్దకు వచ్చేది. ఇప్పుడు యూరియా కోసం కుటుంబమంతా లైన్లో నిలబడే పరిస్థితి వచ్చింది’’ అని కేసీఆర్ విమర్శించారు.



