నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రెడిటేషన్ల గడువును ప్రభుత్వం మరోసారి పెంచింది. ఈ మేరకు ఐ అండ్ పీఆర్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక ఉత్తర్వులు జారీ చేశారు. రేపటితో ముగియనున్న అక్రెడిటేషన్ కార్డుల కాల పరిమితిని 2026 ఫిబ్రవరి 28 వరకు పొడిగించారు. తెలంగాణలో గత రెండేళ్లుగా కొత్తగా అక్రెడిడేషన్ కార్డులను మంజూరు చేయలేదు. గత 22 నెలలుగా అక్రిడేషన్ కార్డుల కాల పరిమితిని ప్రతి మూడు నెలలకు ఒకసారి పొడిగిస్తూనే ఉంది. ఈ సారి గడువు పొడిగించడం ఇది ఏడోసారి కావడం గమనార్హం.
జర్నలిస్టులకు నూతన అక్రిడిటేషన్ల మంజూరు అంశం చాలా కాలంగా పెండింగ్లోనే ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కార్డుల పరిమితిని పలు సార్లు పొడిగిస్తూనే ఉంది. ఈ క్రమంలో కొత్త అక్రిడిటేషన్ల కోసం ఈ నెల 22వ తేదీన ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. ఈ మేరకు జీవో నంబర్ 252 (GO No 252) ను రిలీజ్ చేసింది. జిల్లా, రాష్ట్ర స్థాయిలో అక్రిడిటేషన్ కమిటీలను కమిటీలు ఏర్పాటు చేసి ఆ తర్వాత దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొంది. అయితే ఈ జీవోలో రిపోర్టర్లకు అక్రిడిటేషన్ కార్డుు, డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డులు ఇస్తామని ప్రకటించడం పట్ల జర్నలిస్టుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలో పలు జర్నలిస్టు సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నాయి. జర్నలిస్టుల నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో డెస్క్ జర్నలిస్టులకు నష్టం కలిగించే అంశాలను జీవో నెం.252లో సవరిస్తామని తనను కలిసిన జర్నలిస్టు సంఘంతో తాజాగా సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం స్పష్టం చేశారు. అయితే ఈ జీవో విషయంలో వివాదం చెలరేగడంతోనే ప్రభుత్వం కొత్త కార్డుల మంజూరుకు బదులు పాత కార్డులను మరో రెండు నెలల పాటు పొడిగించిందా అనే చర్చ జరుగుతోంది.



