నవతెలంగాణ – హైదరాబాద్:
: రాష్ట్రంలో మహిళా సాధికారత, ఆదాయం పెంపు, పాడి అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ఇందిరా డెయిరీ ప్రాజెక్టును చేపట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. దీనికింద రాష్ట్రంలోని మహిళా స్వయంసహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికీ రెండేసి పాడి గేదెలు/ఆవులను పంపిణీ చేయనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో దీనిని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది. రాష్ట్రంలోని కొడంగల్ సహా ఇతర ప్రాంతాలకు దీనిని విస్తరించేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది.
ఈ పథకం కింద ప్రతి మండలాన్ని 3 జోన్లుగా, ప్రతి పది గ్రామాలను ఒక యూనిట్గా ఏర్పాటు చేస్తారు. ఒక్కో మహిళా స్వయం సహాయక సంఘ సభ్యురాలికి రూ.2 లక్షల యూనిట్ ధరతో 2 పాడి గేదెలు/ ఆవులను అందజేస్తారు. ఈ సొమ్ములో రాష్ట్ర ప్రభుత్వం 70 శాతం సబ్సిడీ(రూ.1.40 లక్షలు)గా అందజేస్తుంది. మిగిలిన 30 శాతం(రూ.60 వేలు) లబ్ధిదారు వాటాగా బ్యాంకులు రుణంగా ఇస్తాయి. రవాణా కోసం ప్రభుత్వం ట్రాలీ ఆటోలను అందజేస్తుంది. పశువుల ఆరోగ్యం కోసం పశువైద్యులు ప్రతి నెలా తనిఖీలు చేసి హెల్త్ కార్డ్లు జారీ చేస్తారు. షెడ్లకు సౌరవిద్యుత్ సదుపాయాన్ని కల్పిస్తుంది.



