20 లక్షల మంది అన్ఫాలో
సోషల్ మీడియా వేదికగా షాకిస్తున్న జెన్ జీ
రెండు రోజుల్లో రెండు మిలియన్లు తగ్గిన ఫాలోవర్లు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా షాక్ తగిలింది. మధ్యతరగతి వర్గాల సమస్యలను పార్లమెంటు వేదికగా లేవనెత్తుతున్న ఎంపీగా ప్రశంసలు పొందుతున్న రాఘవ్ చద్దాకు అధికార బీజేపీలో చేరిన రెండు రోజుల్లోనే అదే మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు షాక్ ఇచ్చారు. ఆయన బీజేపీలో చేరడం పట్ల సోషల్ మీడియా వేదికగా జెన్జీ విముఖత వ్యక్తం చేస్తోంది. అందుకే సోషల్ మీడియా వేదికల్లో ఆయన ఫాలోవర్లు తగ్గుతున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్) వంటి సామాజిక మాధ్యమాల్లో ఆయన పట్ల ప్రతికూలత వ్యక్తం చేస్తూ అన్ఫాలో అవుతున్నారు. అతి తక్కువ కాలంలోనే రికార్డుస్థాయిలో ఫాలోవర్లు తగ్గిపోవడం చర్చనీయంశంగా మారింది.
ఆమ్ ఆద్మీ పార్టీలో అవినీతి పెరిగిపోయిందని, అక్కడ కొనసాగడం తన వల్ల కాదంటూ ఆయన పార్టీ మార్పుపై వివరణ ఇచ్చినప్పటికీ, ఈ పరిణామం ఆయన వ్యక్తిగత ఇమేజ్పై, ముఖ్యంగా సోషల్ మీడియాలో తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది. రాఘవ చద్దా నిర్ణయాన్ని జెన్ జీ వ్యతిరేకించడమే దీనికి కారణమై ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా చరిత్రలో ఒక రాజకీయ నాయకుడు ఇంత తక్కువ సమయంలో పెద్దఎత్తున ఫాలోవర్లను కోల్పోవడం అరుదైన విషయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యువత సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున ‘అన్ఫాలో’ క్యాంపెయిన్ నిర్వహించడం ఆయన పాపులారిటీకి పెద్ద దెబ్బగా పరిణమించింది. ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతాలను నమ్మి ఆయనను ఆరాధించిన అభిమానులు, ఇప్పుడు ఆయన తీసుకున్న రాజకీయ నిర్ణయాన్ని ఒక అవకాశవాద చర్యగా భావిస్తూ తమ నిరసనను డిజిటల్ రూపంలో తెలియజేస్తున్నారు. ఈ పరిణామం రాఘవ్ చద్దా రాజకీయ భవిష్యత్పై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న ఉత్కంఠ ఇప్పుడు అందరిలోనూ నెలకొంది.
రాఘవ్ చద్దాకు షాక్
- Advertisement -
- Advertisement -



