Sunday, January 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం18న ఖమ్మంలో సీపీఐ వందేండ్ల ఉత్సవాల ముగింపు సభ

18న ఖమ్మంలో సీపీఐ వందేండ్ల ఉత్సవాల ముగింపు సభ

- Advertisement -

లక్షలాది మందితో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో బహిరంగసభ
హాజరుకానున్న సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ.బేబీ, సీఎం ఎ.రేవంత్‌రెడ్డి, వామపక్ష నేతలు
19, 20,21 తేదీల్లో సీపీఐ జాతీయ సమావేశాలు : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సీపీఐ వందేండ్ల ఉత్సవాల ముగింపు సందర్భంగా ఈ నెల 18న ఖమ్మంలోని ఎస్‌ఆర్‌బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో మధ్యాహ్నం 3 గంటలకు లక్షలాది మందితో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. ఆ సభకు సీపీఐ(ఎం) అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ.బేబీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డితో పాటు ఇతర వామపక్ష పార్టీల అగ్ర నేతలు, సుమారు 40 దేశాలకు చెందిన కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నారని వివరించారు. కమ్యూనిజం ఎక్కడుందనే వారికి ‘సిపిఐ ఖమ్మం బహిరంగ సభ’ ఒక రుజువుగా నిలువబోతున్నదన్నారు.

సీపీఐ వందేళ్ల ఉత్సవాల నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మెన్‌ డాక్టర్‌ కె.నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్యపద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ.నర్సింహ, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి కూనంనేని శనివారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఖమ్మం బహిరంగ సభకు ఏపీ, కేరళ, తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరానున్నారనీ, ప్రజలు స్వచ్ఛందంగా రవాణ సౌకర్యాన్ని కల్పించుకుని వస్తున్నారని ఆయన తెలిపారు. బహిరంగ సభకు ముందు పదివేల మందితో ‘జనసేవాదళ్‌ కవాతు’ను నిర్వహించనున్నామన్నారు. 19న ఖమ్మంలో జాతీయ సదస్సును నిర్వహిస్తామనీ, 19, 20,21 తేదీల్లో సీపీఐ జాతీయ కార్యదర్శివర్గం, కార్యవర్గ, సమితి సమావేశాలను నిర్వహించనున్నట్టు కూనంనేని వివరించారు.

వివిధ దేశాల పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ శ్రీలంక, నేపాల్‌, పలు దేశాల్లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీలన్నీ కలిస్తే బాగుటుందని అందరూ కోరుకుంటున్నారనీ, కమ్యూనిస్టు పార్టీల్లో ఐక్యత కోసం తాము కృషి చేస్తున్నామని చెప్పారు. డాక్టర్‌ కె.నారాయణ మాట్లాడుతూ వందేండ్ల కాలంలో తాము అధికారంలోకి రాకపోయినప్పటికీ భారతదేశ సమైక్యతకు విఘాతం కలగకుండా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, మౌలిక అంశాలను నిలబెట్టామని స్పష్టం చేశారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో సంపూర్ణ స్వాతంత్ర్యం ప్రతిపాదన చేసింది భారత కమ్యూనిస్టు పార్టీయే అనీ, దున్నేవాడికి భూమి నినదించిందనీ, పేదలకు భూమిపై హక్కు, తెలంగాణ సాయుధ పోరాటం ఇలా అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించిందని గుర్తు చేశారు. పల్లావెంకట్‌రెడ్డి మాట్లాడుతూ… సమస్యల పరిష్కారాన్ని కోరుకున్నప్పుడు ప్రజలు కమ్యూనిస్టులను గుర్తు చేసుకుంటున్నారనీ, తాము నిత్యం ప్రజల కోసమే పోరాడుతున్నామని అన్నారు. భవిష్యత్తు కమ్యూనిస్టులదేనని నొక్కి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -