నవతెలంగాణ-హైదరాబాద్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా శిక్ష అనుభవించిన ఎ.జి.పేరరివాళన్.. తాజాగా అడ్వకేట్గా మారారు. తమిళనాడు- పుదుచ్చేరి బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా ఇటీవల తన పేరు నమోదు చేసుకున్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో 31 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన పేరరివాళన్ 2022లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విడుదలయ్యారు. ఆ తర్వాత బెంగళూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లా కాలేజీలో న్యాయవిద్యను అభ్యసించారు. అక్కడ డిగ్రీ పూర్తి చేసి.. 2025లో ఆల్ ఇండియా బార్ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. త్వరలో ఆయన మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయనున్నారు. ఈ సందర్భంగా పేరరివాళన్ మీడియాతో మాట్లాడుతూ …. సరైన న్యాయ సహాయం అందక జైళ్లల్లో మగ్గిపోతున్న వేలాది మంది ఖైదీల గొంతుకగా మారడమే తన లక్ష్యమన్నారు. న్యాయం అందని నిరుపేద జీవిత ఖైదీల కోసం తాను పనిచేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు.
1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబదూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్గాంధీపై ఓ మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఆ బాంబు తయారీకి అవసరమైన రెండు బ్యాటరీలను (తొమ్మిది వోల్టులు) 19 ఏళ్ల పెరారివాళన్ కొనుగోలు చేసి ఇచ్చారనే అభియోగాలపై అరెస్టయ్యారు. ఈ కేసులో పెరారివాళన్కు 1998లో తొలుత ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరణశిక్ష విధించగా.. 2014లో సుప్రీంకోర్టు దాన్ని జీవిత ఖైదుగా మార్చింది. ఆ తర్వాత ఆ రాష్ట్ర గవర్నర్ క్షమాభిక్ష ప్రసాదించడంతో.. ఆయన్ను విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.



