నవతెలంగాణ – హైదరాబాద్ : అవినీతి కుంభకోణం కేసులో అర్జెంటీనా చీఫ్ ఆఫ్ స్టాఫ్ మూన్యువల్ అడోర్నీ శనివారం రాజీనామా చేశారు. 2023 డిసెంబర్లో ప్రభుత్వ విభాగంలో చేరినప్పటి నుండి అక్రమంగా సంపదను కూడబెట్టార్న ఆరోపణలపై ఆయనపై న్యాయ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అయితే మితవాద అధ్యక్షుడు జేవియర్ మిలే తన సన్నిహితుడైన అడోర్నీని ప్రభుత్వ యంత్రాంగంలోనే కొనసాగించేందుకు యత్నిస్తున్నప్పటికీ.. అవినీతి ఆరోపణలు తీవ్ర రాజకీయ సంక్షోభానికి దారితీసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
పెరుగుతున్న న్యాయవ్యవస్థ ఒత్తిడి, మీడియా పర్యవేక్షణ, ప్రతిపక్షాల డిమాండ్లతో అడోర్నీ రాజీనామా చేసినట్లు వెల్లడించాయి. అడోర్నీ ఆస్తుల ప్రకటనలో వ్యత్యాసాలు, అనుమానాస్పద రియల్ ఎస్టేట్ లావాదేవీలు, ప్రకటించని బ్యాంక్ ఖాతాలపై ప్రాసిక్యూటర్లు పరిశీలిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం విధించిన కఠినమైన ఆర్థిక పొదుపు చర్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ దర్యాప్తు దేశవ్యాప్తంగా మరింత ప్రజాగ్రహాన్ని రేకెత్తించింది.



