డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టులో
వాట్సాప్ డాక్యుమెంట్ వెల్లడి
న్యూఢిల్లీ : స్వతంత్ర దర్యాప్తులు నిర్వహించిన అనంతరం డిజిటల్ అరెస్టులు, లా ఎన్ఫోర్స్మెంట్ అమలు నకిలీ అధికారులతో సంబంధముందని గుర్తించిన 9400 ఖాతాలను నిషేధించినట్టు వాట్సాప్, హోం శాఖకు తెలియచేసినట్టు సుప్రీంకోర్టులో నమోదు చేసిన పత్రాలు పేర్కొన్నాయి. ‘సీడ్’ (వ్యక్తిగత స్కామర్లు) పై దృష్టి కేంద్రీకరించి, మూసివేయడం కంటే మొత్తంగా ఈ కుంభకోణాలకు పాల్పడుతున్నవారి నెట్వర్క్ను కూల్చివేయడంపై దృష్టి సారించినట్లు వాట్సాప్ తెలిపింది. ప్రధానంగా కంబోడియాలోనే వీరు చురుకుగా వున్నారని పేర్కొంది.
దర్యాప్తు సంస్థలు, కేంద్ర ప్రభుత్వం పంపే హెచ్చరికల సంకేతాలను వేటికవి విడివిడిగా లేదా ఒక్కసారిగా వచ్చే నివేదికలుగా వ్యవహరించకుండా మొత్తంగా క్రిమినల్ నెట్వర్క్ను గుర్తించి, విచ్ఛిన్నం చేసేందుకు ‘సీడ్'(మూలం)గా గుర్తించామని వాట్సాప్ డాక్యుమెంట్ పేర్కొంది.
వాట్సాప్, హోం శాఖల మధ్య జరిగిన కమ్యూనికేషన్ను, ఇండియన్ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం (14సి) తరపున హోం శాఖ దాఖలు చేసిన స్టేటస్ నివేదికకు జతపరిచారు. కేంద్ర హోం శాఖ తరపున సుప్రీంలో అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి వాదనలు వినిపించారు. మార్చిలో ప్రత్యేక కార్యదర్శి (అంతర్గత భద్రత) నేతృత్వంలో అంతర్ విభాగాల కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో అనేక చర్యలపై చర్చ జరిగినట్లు ఆ నివేదిక పేర్కొంది. వాట్సాప్తో పాటూ ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా, రిలయన్స్ జియో, బిఎస్ఎన్ఎస్ వంటి ప్రధాన టెలికం సర్వీస్ ప్రొవైడర్లను కూడా ఆహ్వానించారు. సిమ్ బైండింగ్ అంటే భౌతికంగా సిమ్ కార్డుతో ఖాతాను ముడిపెట్టడంపై పనిచేస్తున్నట్టు వాట్సాప్ తెలిపింది. అలాగే సమాచార సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన నిబంధనలను పాటించనున్నట్లు తెలిపింది. డిజిటల్ అరెస్టు కుంభకోణాల్లో ఉపయోగించిన ఫోన్లను గుర్తించి, వాటి ఐడిలను బ్లాక్ చేయడానికి అవసరమైన యంత్రాంగాలను ప్రవేశపెట్టాలని హోం శాఖ, ఇతర పక్షాలు అంగీకరించాయి. లా ఎన్ఫోర్స్మెంట్ నకిలీ అధికారులను, అలాగే అధికారిక లోగోలను, సమాచారాన్ని దుర్వినియోగం చేయడాన్ని గుర్తించేందుకు కృత్రిమ మేథస్సును, మెషిన్ లెర్నింగ్ ఆధారిత వ్యవస్థలను బలోపేతం చేయాలని అందుకోసం చర్యలు తీసుకుంటున్నట్టు వాట్సాప్ తెలిపింది.
9400 ఖాతాలను నిషేధించాం
- Advertisement -
- Advertisement -



