నవతెలంగాణ – హైదరాబాద్ : పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో ఓ ఇంటి బయట జరిగిన పేలుడులో ముగ్గురు పిల్లలు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు గురువారం తెలిపారు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని లోయర్ సౌత్ వజీరిస్తాన్లోని ఘ్వా ఖ్వా ప్రాంతంలో బుధవారం (మే 6) రాత్రి మోటార్ సైకిల్లో అమర్చిన పేలుడు పదార్థం పేలడంతో ఈ విస్ఫోటనం సంభవించింది.
సద్దామ్ హుస్సేన్ అనే వ్యక్తి ఇంటి బయట పేలుడు పదార్థాన్ని అమర్చిన మోటార్సైకిల్ని ఓ గుర్తు తెలియని వ్యక్తి పార్క్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతులను షా హుస్సేన్ (15), సనాయా బీబీ (7), సోరీన్ బీబీ (8) గా పోలీసులు గుర్తించారు. ఈ పేలుడు వల్ల గాయపడ్డ ఇద్దరు చిన్నారుల్ని వానాలోని ప్రధాన ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు, భద్రతా దళాలు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై స్థానికులు విచారం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు అమాయక పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని హతమారుస్తున్నారని స్థానికులు తెలిపారు.



