Tuesday, February 10, 2026
E-PAPER
Homeజాతీయంగవర్నర్ల తీరు వివాదాస్పదం

గవర్నర్ల తీరు వివాదాస్పదం

- Advertisement -

అసెంబ్లీలో ఎల్డీఎఫ్‌ సర్కార్‌ ప్రసంగ కాపీలోని ముఖ్యాంశాలను విస్మరించిన కేరళ గవర్నర్‌
ఈ వ్యవహార శైలి రాజ్యాంగ స్ఫూర్తికి,
సభా పద్ధతులకు విరుద్ధమన్న పినరయి విజయన్‌
తమిళనాడు శాసనసభ నుంచి గవర్నర్‌ వాకౌట్‌
బీజేపీ తాబేదార్లుగా వ్యవహారశైలి : ఎల్‌డీఎఫ్‌ నేతలు


తిరువనంతపురం/చెన్నై: రాష్ట్ర ప్రథమ పౌరుడిగా, రాజ్యాంగ పరిరక్షకుడిగా వ్యవహరించాల్సిన గవర్నర్లు ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న పోకడులు పెరిగిపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వినాశకర విధానాలపై ధీరోచితంగా పోరాడుతున్న కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో గవర్నర్ల ధోరణలు వీరి విమర్శలకు బలం చేకూర్చుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మంగళవారం చోటుచేసుకున్న ఘటనలు సైతం గవర్నర్ల తీరు రాజ్యాంగ స్ఫూర్తిని దిగజార్చేలా ఉందని సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేరళ ఆర్థిక సంక్షోభ పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత ధోరణే కారణమంటూ అక్కడి ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం గవర్నరు ప్రసంగ పాఠంలో స్పష్టంగా పేర్కొనగా..అది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగిస్తుందని భావించిన ఆ రాష్ట్ర గవర్నరు ఆ భాగాన్ని చదవకుండా కత్తెర వేశారు. దీంతో సభా నాయకుడు, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ జోక్యం చేసుకొని సరిదిద్దాల్సివచ్చింది. అలాగే తమిళనాడు అసెంబ్లీలోనూ దాదాపు ఇదే తరహా వివాదస్పద ఘటన చోటుచేసుకున్నది. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దానిస్థానంలో తీసుకొచ్చిన విబిజి ఆర్‌ఎఎంజిని వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నరు ప్రసంగ పాఠంలో చేసిన డిమాండ్‌ను చదవాల్సివస్తుందని ఏకంగా సభ నుంచే గవర్నరు వాకౌట్‌ చేశారు. ఈ పెడ ధోరణులు అత్యంత తీవ్రమైనవని, రాజ్యాంగ ఉల్లంఘనలేనని రాజకీయ విశ్లేషకులు, ప్రజాస్వామ్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రంపై విమర్శలు దాటవేసి స్వీయ వ్యాఖ్యానాలు
– కేరళ గవర్నరు తీరును సరిదిద్దిన ముఖ్యమంత్రి పినరయి విజయన్‌
కేరళలో మంగళవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ కాపీలో ముఖ్యమైన అంశాలను విస్మరించి ..ఆ స్థానంలో తన స్వీయ వ్యాఖ్యానాలు చేర్పి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానపర పత్రమైన గవర్నరు ప్రసంగపాఠంలో చదివేది గవర్నరే అయినా ..రాష్ట్ర కేబినెట్‌ రూపొందించి ఆమోదించిన ప్రసంగాన్నే గవర్నరు చదవాల్సివుంటుంది. ఇది రాజ్యాంగ నియమం. అలా కాకుండా గవర్నరు తన వ్యక్తిగత అభిప్రాయాలు జొప్పించి ప్రసంగించారు. ఈ రాజ్యాంగ నియమాన్ని ఉల్లంఘించారని గుర్తించిన వెంటనే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ గవర్నరు చేసిన ప్రసంగ పాఠాన్ని సరిదిద్దారు. గవర్నరు వ్యక్తిగత వ్యాఖ్యానాలను మినహాయించి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదించిన ప్రసంగ పాఠాన్నే అధికారికంగా రికార్డు చేయాలని శాసనసభ స్పీకర్‌ను ముఖ్యమంత్రి విన్నవించారు.

తమిళనాడులో గవర్నర్‌ సభా నిష్క్రమణ
తమిళనాడు శాసనసభ సమావేశాల్లోనూ కీలక పరిణామం చోటుచేసుకుంది. శాసనసభ సమావేశాల్లో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తన ప్రసంగాన్ని చదవకుండా మధ్యలోనే వాకౌట్‌ చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌జిఎ) స్థానంలో తీసుకొచ్చిన వికసిత్‌ భారత్‌ – గ్రామీణ ఉపాధి, జీవనోపాధుల పథకం (విబిజి ఆర్‌ఎఎంజి)ని వెనక్కి తీసుకొని ఎంజిఎన్‌ఆర్‌జిఎకు నిధులు పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి కోరుతూ గవర్నరు ప్రసంగపాఠంలో తమిళనాడు ప్రభుత్వం ఒక పేరాను చేర్చింది. ఈ పేరా చదివాల్సివస్తుందనే గవర్నరు సభ నుంచి నిష్క్రమించినట్లు తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీలో గవర్నరు ప్రసంగానికి ముందు తమిళతల్లి గీతం..ప్రసంగం ముగింపు అనంతరం జాతీయగీతం ఆలపించడం ఆనవాయితీ. కానీ ఈ సాంప్రదాయానికి భిన్నంగా తన ప్రసంగానికి ముందుగానే జాతీయగీతం ఆలపించాలని సభాపతిని గవర్నరు కోరారు. దీనికి సభాపతి నిరాకరించారు. సభాసాంప్రదాయాల ప్రకారం తమిళతల్లి గీతం ఆలపిస్తారని గుర్తు చేశారు. దీంతో గవర్నరు సభ నుంచి వెళ్లిపోయారు. లోక్‌భవన్‌ విడుదల చేసిన ప్రకటనలోనూ పరోక్షంగా ఈ విషయాన్ని పేర్కొన్నారు. ‘శాసనసభల్లో గవర్నర్‌ ప్రసంగానికి ముందు, తర్వాత జాతీయగీతం ఆలపించడం ఆనవాయితీ.

ఇదే తరహాలో గవర్నరు ప్రసంగానికి ముందు, ఆ తర్వాత కూడా జాతీయగీతం ఆలపించాలని సభాపతిని గవర్నరు కోరారు. అందుకు సభాపతి నిరాకరించడంతో గవర్నరు సభ నుంచి నిష్క్రమించారు’ అని లోక్‌భవన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. వాస్తవానికి ఇది సాకు మాత్రమేనని, ఆయన కేంద్ర ప్రభుత్వ వినాకశర ధోరణులను తమిళనాడు ప్రభుత్వం ఖండిస్తున్న విషయాలను చదవాల్సివస్తుందనే, ప్రసంగించకుండా వెళ్లిపోయారని డిఎంకె నేతలు విమర్శలు గుప్పించారు.

సభా సాంప్రదాయాల ఉల్లంఘనుడు : గవర్నర్‌పై స్టాలిన్‌ విమర్శ
సభా సాంప్రదాయాలను పదేపదే గవర్నర్లు ఉల్లంఘిస్తున్న ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో అస్సలు శాసనసభలో గవర్నరు ప్రసంగ సాంప్రదాయాన్నే రద్దు చేయాల్సిన అవసరం ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేసే వరకు డిఎంకె పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు. గవర్నరు వాకౌట్‌ ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సభ నుంచి గవర్నర్‌ వాకౌట్‌ చేయడం సభా సాంప్రదాయాలను, నియమాల ఉల్లంఘనే. రాజ్యాంగంలోని అధికరణ 176 ప్రకారం గవర్నర్‌ తన ప్రసంగాన్ని పూర్తిగా చదవాలి. రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసే ఈ ప్రసంగ పాఠంలో గవర్నరు యథాతథంగా చదవాలే మినహా తన వ్యక్తిగత వ్యాఖ్యలు చేర్చడానికి వీల్లేదు’ అని స్టాలిన్‌ పేర్కొన్నారు. వాస్తవానికి సభలో గవర్నరు ప్రసంగ పాఠానికి సంబంధించి వివరణలు కోరుతూ గవర్నరు అడిగిన ప్రశ్నలన్నిటికీ గత సోమవారమే తాము సమాధానం ఇచ్చామని కూడా స్టాలిన్‌ తెలిపారు.

ఆర్థిక సంక్షోభానికి కేంద్రమే కారణం : విజయన్‌
గవర్నర్‌ విస్మరించిన పేరాల్లో కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత ధోరణులను ప్రశ్నిస్తూ కొన్ని ముఖ్యమైన అంశాలున్నట్టు పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభం, పెండింగ్‌ బిల్లులు వంటి అంశాలను ప్రసంగ పాఠంలో ఉన్నా..ఆ భాగాన్ని గవర్నర్‌ విస్మరించి స్వీయభాషణలు వినిపించారు. ఇది రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించడమే. రాష్ట్ర కేబినెట్‌ ఆమోదించిన గవర్నరు ప్రసంగ పాఠంలోని 12వ పేరాలో సమాఖ్య విధానం, కేంద్రం తీసుకుంటున్న చర్యల గురించి, 15వ పేరాలో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వ కక్షసాధింపు చర్యలే కారణమన్న విషయాలున్నాయి. అయితే వాటి గురించి గవర్నర్‌ ప్రసంగంలో ప్రస్తావించక పోవడం రాజ్యాంగ స్ఫూర్తికి, సభా పద్ధతులకు విరుద్ధమని సిఎం అన్నారు. గవర్నర్‌ విస్మరించిన అంశాలను జోడించి మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగాన్ని ప్రామాణిక పత్రంగా అంగీకరించాలని స్పీకర్‌ను అభ్యర్థించారు. సమాఖ్య విధానం, రాజ్యాంగ విలువలను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా కేరళ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. అయితే అందుకు సంబంధించిన విషయాలు 12, 15వ పేరాలో ఉన్నాయని పేర్కొన్నారు. కాగా సభా నిబంధనల ప్రకారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగాన్నే అధికారికంగా భావిస్తామని స్పీకర్‌ ఎఎన్‌ షంషీర్‌ తెలిపారు. కొన్ని అంశాలను వదిలేస్తూ గవర్నర్‌ చేసిన ప్రసంగాన్ని అధికారికంగా గుర్తించబోమన్నారు. మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగం కాపీలను మీడియాకు అందజేయాలని స్పీకర్‌ ఆదేశించారు. గవర్నర్‌ ప్రసంగం విషయంలో అసెంబ్లీలో జరిగిన వివాదంపై కూడా ఎల్‌డిఎఫ్‌ సభ్యులు సతీశన్‌ స్పందించారు. క్యాబినెట్‌ ఆమోదించిన అంశాలను ప్రసంగంలో విస్మరించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగాన్ని గవర్నర్‌కు మార్చే హక్కు లేదన్నారు. ఈ విషయంలో సీఎం అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్టు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -