నవతెలంగాణ-హైదరాబాద్: దొంగల బారినపడకుండా భద్రంగా ఉంటాయని భావించి ఓ రైతు రూ.5 లక్షలను భూమిలో పాతిపెట్టారు. అయితే ఆ ప్రదేశాన్ని మర్చిపోవడంతో ఏడాదిపాటు అవి దొరకలేదు. చివరికి ఆ డబ్బు దొరికినప్పటికీ అప్పటికే చెదపురుగులు తినేశాయి. దీంతో ఆ రైతు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది.
స్థానిక పోలీసుల వివరాల మేరకు … నెవాయి గ్రామానికి చెందిన రైతు మంగిలాల్ ఏడాది క్రితం తన భూమిలో కొంతభాగాన్ని రూ.5 లక్షలకు విక్రయించారు. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా.. వచ్చిన సొమ్మును జాగ్రత్తగా ఉంచాలని భావించి ఓ సంచిలో మూటకట్టి వ్యవసాయ భూమిలో పాతిపెట్టారు. కొన్ని నెలల తర్వాత ఆ డబ్బు దాచిపెట్టిన స్థలం మర్చిపోవడంతో ఆందోళనకు గురయ్యారు. అదే విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పారు. దీంతో దాదాపు ఆరు ఎకరాలు ఉన్న పొలంలో పలుచోట్ల తవ్వి చూసినా.. డబ్బు దొరకలేదు. ఇటీవల విత్తనాలు వేయడానికి పొలం దున్నుతున్న సమయంలో డబ్బు సంచి బయటపడడంతో మంగిలాల్ కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. కానీ, తీరా సంచి తెరిచి చూడగా అందులోని నోట్లను చెదపురుగులు తినేశాయి. వాటిలో స్వల్పంగా దెబ్బ తిన్న నోట్లను తీసుకొని ఆ కుటుంబం స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను సంప్రదించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే నోట్ల పరిస్థితి చూసి వాటిని తీసుకునేందుకు బ్యాంకు అధికారులు నిరాకరించడంతో వారు నిరాశతో వెనుదిరిగారు.



