నవతెలంగాణ-హైదరాబాద్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టిఎ)ను రద్దు చేసి, గతంలో మాదిరిగా పరీక్షల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి అప్పగించాలని కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీసీఐ(ఎం)పొలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్ పేర్కొన్నారు. నీట్-యుజి పరీక్షను రద్దు చేసిన ఎన్ టి ఎను రద్దు చేయాలని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన డిమాండ్ చేశారు. నీట్- యుజి పరీక్ష చుట్టూ నెలకొన్న వివాదం, ప్రశ్నాపత్రాల లీకేజీలు అత్యంత తీవ్రమైనవి, ఖండించదగినవని అన్నారు. కేంద్రం పరీక్షల నిర్వహణ బాధ్యతను ఎన్ టి ఎకు అప్పగించిన తర్వాత ప్రశ్నాపత్రాలు లీక్ కావడం ఇదే మొదటిసారి కాదని అన్నారు. ఈ పరిస్థితి సంవత్సరాల తరబడి కఠోరశ్రమతో పరీక్షకు సిద్ధమయ్యే లక్షలాది మంది విద్యార్థుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని అన్నారు.
పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు సంవత్సరాల తరబడి కృషి, ఆర్థిక ఇబ్బందులతో పరీక్షల కోసం సిద్ధమవుతారని, కానీ ఇటువంటి అవకతవకలు వారికి సరైన అవకాశాలను దూరం చేస్తున్నాయని మండిపడ్డారు. పరీక్షలను విశ్వసనీయంగా నిర్వహించాల్సిన బాధ్యత గలవారు భద్రతను కల్పించడంలో విఫలమవడం దేశ విద్యావ్యవస్థకు పెద్ద అవమానమని అన్నారు. కోచింగ్ ఇన్ స్టిట్యూట్ మాఫియాల పాత్రపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమగ్రమైన, పారదర్శకమైన, నిర్ణీత కాలంలో విచారణ జరిగేలా చూడాలని పిలుపునిచ్చారు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పరీక్షా వ్యవస్థ విశ్వసనీయతను పునరుద్ధరించడానికి కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రయోగాలకు ప్రయోగశాల కాదని, ప్రవేశ పరీక్షల నిర్వహణను అపహాస్య చేస్తూ విద్యార్థుల కలలను నాశనం చేయవద్దని కోరారు.



