మే 29లోపు లిఖితపూర్వక వాదనలకు అనుమతి : సుప్రీంకోర్టు
అయ్యప్ప ఆలయంలో మహిళలపై
వివక్ష అంశంపై ముగిసిన వాదనలు
న్యూఢిల్లీ : శబరిమల ఆలయంతో సహా వివిధ మతపరమైన ప్రదేశాల్లో మహిళల పట్ల వివక్ష, మతస్వేచ్ఛ విషయంలో దాఖలైన పిటిషన్లపై తీర్పును సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో 9 మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును 16రోజులపాటు విచారణ జరిపింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాదులు సి.ఎస్. వైద్యనాథన్, అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోహత్గీ, ఇందిరా జైసింగ్ల వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.విచారణకు ముందు శబరిమల ఆలయంలోకి రుతుక్రమం వయస్సున్న మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని సమర్థించాలని కేంద్రం లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసింది. ఈ అంశం పూర్తిగా మత విశ్వాసాలకు సంబంధించినది అయినందున న్యాయసమీక్ష పరిధిలోకి రాదని పేర్కొంది. 2018 సెప్టెంబర్లో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 4:1 మెజారిటీతో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. 2019 నవంబర్లో అప్పటి సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ వివాదంతోపాటు ఇతర మతాల్లోని మహిళలపై వివక్ష అంశాలను 9మంది సభ్యులతో కూడిన ధర్మాసనానికి బదిలీ చేసింది.
శబరిమల కేసులో తీర్పు రిజర్వ్
- Advertisement -
- Advertisement -



