నవతెలంగాణ – హైదరాబాద్ : ఇటీవల పెరిగిన ఇంధన ధరలకు నిరసనగా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో తమపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు యాప్ ఆధారిత సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. డెలివరీ, రవాణా కార్మికులకు కిలోమీటర్కు కనీస చెల్లింపు రూ. 20గా నిర్ణయించాలని యూనియన్ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది.
దాదాపు నాలుగేళ్ల తర్వాత చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు సుమారు రూ. 3 మేర పెంచాయి. ఈ పెంపు రైడ్-హెయిలింగ్, ఫుడ్ డెలివరీ, లాజిస్టిక్స్ వంటి యాప్ ఆధారిత సేవలపై ఆధారపడిన దాదాపు 1.2 కోట్ల మంది కార్మికులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని యూనియన్ ఒక ప్రకటనలో పేర్కొంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడమే ఇంధన ధరల పెంపునకు కారణమని తెలిపింది.
ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షురాలు సీమా సింగ్ మాట్లాడుతూ.. పెరిగిన ఇంధన ధరలు, ఎల్పీజీ సిలిండర్ల రేట్లతో కార్మికులు ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారని తెలిపారు. నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా ఆదాయం పెరగకపోతే, చాలా మంది గిగ్ వర్కర్లు ఈ రంగాన్ని విడిచిపెట్టే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. ముఖ్యంగా స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి ప్లాట్ఫామ్లతో పనిచేసే డెలివరీ పార్ట్నర్లు ప్రతికూల వాతావరణంలో ఎక్కువ గంటలు మోటార్సైకిళ్లపై పనిచేస్తారని, వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కిలోమీటర్కు రూ. 20 కనీస సర్వీస్ రేటును అమలు చేయాలని ప్రభుత్వం, డిజిటల్ ప్లాట్ఫామ్ కంపెనీలను ఆమె కోరారు.



