Thursday, July 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఆఫీస్ భవనంపై నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య

ఆఫీస్ భవనంపై నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాలెడ్జ్ సిటీలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తాను పనిచేస్తున్న కార్యాలయ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన తిరువీధి అవినాశ్ (40), రెండు నెలల క్రితమే ఉద్యోగ రీత్యా తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌కు వచ్చారు. ఆయన నాలెడ్జ్ సిటీలోని ఒక ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో కార్యాలయం నుంచి బయలుదేరుతున్నట్లు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు.

అయితే, రాత్రి గడుస్తున్నా ఆయన ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గాలించగా, కార్యాలయ భవనం వెనుక రక్తపు మడుగులో అవినాశ్ మృతదేహం లభ్యమైంది. భవనంలోని నాలుగో అంతస్తులో ఉన్న ప్లే ఏరియా నుంచి ఆయన కిందకు దూకినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు.

ఇటీవల జరిగిన ఓ సైబర్ మోసంలో అవినాశ్ సుమారు రూ.2 లక్షల వరకు నగదు కోల్పోయారని, ఆ మనస్తాపంతోనే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఆర్థిక ఇబ్బందులతో పాటు ఇతర కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌పెక్టర్ సీహెచ్ వెంకన్న తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా మరియు సహోద్యోగుల్లో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -