- తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్
నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్పై అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విరుచుకుపడ్డారు. తన అరెస్టు ‘దృష్టిమళ్లించే వ్యూహం’ అని మండిపడ్డారు. బుధవారం విజయ్ ప్రభుత్వం అసెంబ్లీలో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అనంతరం ఉదయనిధి స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. కావేరీ, మెకదాటు అంశాలను లేవనెత్తకుండా అడ్డుకునేందుకు విజయ్ ప్రభుత్వం యత్నించిందని మండిపడ్డారు. ఈ రెండు అంశాలపై ప్రభుత్వ వైఫల్యాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం తాను ఆందోళన చేపట్టానని, దీంతో తనను అరెస్టు చేశారని అన్నారు. అన్నాడిఎంకె ఎమ్మెల్యేలను, డిఎంకెకి చెందిన జన్ జెడ్ కార్యకర్తలను కూడా లక్ష్యంగా చేసుకుందని అన్నారు. టివికె నేతృత్వంలోని తమిళనాడులో పలు అంశాలు, సమస్యలు ఉన్నాయని, వీటి నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు తనను అరెస్టు చేయించారని అన్నారు. శాంతి భద్రతలు క్షీణించాయని, గడిచిన ఐదు వారాల్లో రాష్ట్రంలో ఐదు లాకప్ డెత్ కేసులు, ఆరు కుల ఆధారిత హత్యలు జరిగాయని అన్నారు. మధ్యంతర బడ్జెట్పై మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు బడ్జెట్లో ఒక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదని అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ల్యాప్టాప్ సహా పలు పథకాలకు, పేర్లు మార్చారని దుయ్యబట్టారు. పలు రంగాల్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉందని గుర్తించినందుకు ఆర్థికమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.



