నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీని సాధించారు. ఇటీవల తన మంత్రుల బృందానికి శాఖలు కూడా కేటాయించారు. ఎన్నికల బరిలో దుమ్మురేపిన విజయ్..పాలనలో ఏ మేరకు మెప్పిస్తారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం విజయ్తోపాటు మంత్రివర్గంలోని సభ్యులు దాదాపు కొత్తవారే. ఈక్రమంలోనే ఎంపీ, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఎన్నికైన విజయ్ ప్రభుత్వానికి కాస్తా టైం ఇవ్వాలని, అప్పడే జడ్జిమెంట్ ఇవ్వకూడదని సూచించారు.
“చాలామంది కొత్తవారు రాజకీయాల్లోకి వచ్చారు. అయితే రాజకీయాల్లో కొత్తవారి రాక అనేది ఏమాత్రం అసాధారణమైన విషయం కాదు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు, మంత్రులందరూ కూడా కొత్తవారే. కాబట్టి మనం కొత్తవారిని తక్కువ అంచనా వేయకూడదు, అలాగే వారి నుండి మరీ ఎక్కువగా ఆశించకూడదు. అందుకే విజయ్ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని ఆయన ఆదివారం మీడియాతో అన్నారు.



