నవతెలంగాణ – వనపర్తి : కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం 45 రోజులైన కొనడం లేదంటూ వనపర్తి జిల్లా రాజపేట రైతులు రోడ్డెక్కారు. ట్రాక్టర్లకు ధాన్యం బస్తాలు ఎత్తి రోడ్డుపైకి తీసుకొచ్చారు. కొన్ని ధాన్యం బస్తాలను నడి రోడ్డుపై నుంచి నిప్పు పెట్టారు. అనంతరం నడిరోడ్డుపై ఎర్రటి ఎండలో బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మొండి వైఖరిని వీడి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి వెనువెంటనే లారీలకు ఎత్తి మిల్లులకు తరలించాలని నినాదాలు చేశారు.
వనపర్తి జిల్లాలో ఎక్కడ చూసినా వరి ధాన్యం కుప్పలు కనిపిస్తున్నాయి. రైతుల ధాన్యం అమ్ముకోవడానికి మార్కెట్ యాడ్ తో పాటు కొనుగోలు సెంటర్ల దగ్గర పడిగాపులు కాస్తూ ఎన్నో కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరి ధాన్యం విషయంలో తన మొండివైఖరిని వీడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వనపర్తి మండలం రాజపేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని వనపర్తి నుండి కొత్తకోటకు వెళ్లే రోడ్డుపై వరి ధాన్యం పోసి ధాన్యానికి నిప్పు పెట్టి ధర్నా నిర్వహించారు.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 45 రోజులు అవుతున్నా ఒక్క బస్తా తూకం చేయడం లేదని రైతులు కన్నెర్ర చేశారు. అనంతరం రాజపేట రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వరి ధాన్యం బస్తాలను రోడ్డు పైకి తీసుకొచ్చి రోడ్డుకు అడ్డంగా వేసి ఖాళీ బస్తాలకు నిప్పంటించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాస్తారోకో సింగల్ విండో అధ్యక్షులు రఘవర్ధన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఎల్లయ్య, ఉప సర్పంచ్ చిన్నారెడ్డి, మాజీ సర్పంచ్ జయరాములు, నాయకులు సుదర్శన్ రెడ్డి, మాధవ రెడ్డి, రైతులు తిరుపతయ్య, తెలుగు నారాయణ, మెహాన్ రెడ్డి, సత్యా రెడ్డి, శంకర్ రెడ్డి, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు.



