మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే
నవతెలంగాణ – నసురుల్లాబాద్
స్వాతంత్య్ర ఉద్యమంలో భగత్ సింగ్ పాత్ర ఎంతో కీలకమని, వారి సేవలు చిరస్మరణీయం అని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షింధే అన్నారు. శుక్రవారం బీర్కూర్ మండల కేంద్రంలో భగత్ సింగ్ నూతన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నూతన భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభ లో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఆయన చూపిన తెగువతోనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందన్నారు. బ్రిటిష్ పాలకులను గడగడలాడించి దేశానికి స్వాతంత్య్రం సాధించడంలో భగత్ సింగ్ చేసిన త్యాగాలు మరువలేనివని గుర్తు చేశారు.
నేటి యువత భగత్ సింగ్ను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని హన్మంత్ షింధే పిలుపునిచ్చారు. యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశం అభివృద్ధి బాటలో నడుస్తుందన్నారు. నేటి యువత సోషల్ మీడియా లో ఎక్కువ సేపు గడపకుండా భవిష్యత్తు కోసం బాటలు వేసుకునే విధంగా ప్రణాళికలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధర్మతేజ, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు బాలరాజు, విద్యార్థి సంఘాల నాయకులు శ్రీకాంత్, కృష్ణ, శివకుమార్, నవీన్ కుమార్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



