Friday, June 6, 2025
E-PAPER
Homeజాతీయంవాన కబురు

వాన కబురు

- Advertisement -

కేరళను తాకిన రుతుపవనాలు
ఎనిమిది రోజులు ముందుగానే ప్రవేశం
2009 తర్వాత తొలిసారి : ఐఎండీ

తిరువనంతపురం : భానుడి సెగతో చెమటలు కక్కుతున్న ప్రజలకు రుతుపవనాలు చల్లని కబురును తీసుకొచ్చాయి. షెడ్యూల్‌ కంటే ఎనిమిది రోజుల ముందే కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈ విషయాన్ని తెలిపింది. సాధారణంగా జూన్‌ 1న కేరళను రుతుప వనాలు తాకుతాయి.ఇలా రుతుపవనాలు ముందుగా ప్రవేశించటం 16 ఏండ్లలో ఇదే తొలిసారి కావటం గమనార్హం. చివరగా 2009లో షెడ్యూల్‌ కంటే ముం దే కేరళను తాకాయి. ఐఎండీ సమాచారం ప్రకారం.. రుతుపవనాలు కేరళలోనే కాకుండా కర్నాటక, పుదుచ్చేరి, తమిళనాడు, మిజోరంలోని కొన్ని ప్రాంతాలకు కూడా చేరుకున్నాయి. ఇవి వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రాబోయే రెండు, మూడ్రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలతో పాటు పశ్చిమ బెంగాల్‌, సిక్కింలోని కొన్ని ప్రాంతాలకు చేరుకుంటాయని భావిస్తున్నారు. చివరగా 2009, 2001లో రుతుపవనాలు కేరళకు ఇంత త్వరగా వచ్చాయి. ఆ సమయంలో మే 23న రుతుపవనాలు కేరళకు చేరుకున్నాయి.
గతంలో ఇలా…
సాధారణంగా కేరళలో రుతుపవనాలు జూన్‌ 1న ప్రారంభమవుతాయి. 1918లో మే 11న రుతుపవనాలు ప్రవేశించి రికార్డును నమోదు చేశాయి. 1972లో అత్యంత ఆలస్యంగా జూన్‌ 18న రుతుపవనాలు ప్రారంభమయ్యాయి. గత 25 ఏండ్లలో 2016లో రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. ఆ ఏడాది జూన్‌ 9న కేరళలోకి ప్రవేశించాయి. రుతుపవనాల రాక గతేడాది మే30న ఉంటే.. 2023లో జూన్‌ 8న, 2022లో మే 29న కేరళను తాకాయి.
కేరళకు వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌
గత రెండ్రోజులుగా కేరళలో వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. తిరువనంతపురం, కొల్లాం, కొట్టాయం, అలప్పుజ, త్రిసూర్‌, ఇడుక్కి, మలప్పురం జిల్లాలకు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా కేరళలోని పలు ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. పలు నగరాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. కొమ్మలు విరిగి రోడ్ల మీద పడ్డాయి. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. 24, 25 తేదీలకుగానూ 9జిల్లాలకు, 26వ తేదీకి నాలుగు జిల్లాలకు, 27వ తేదీకి ఆరు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -