నవతెలంగాణ-హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ తెలివిమీరిపోతున్నారు.. అమాయకులను వంచించేందుకు ఆకర్షణీయమైన పథకాలు పన్నుతున్నారు. అందినకాడికి దండుకున్నాక జెండా ఎత్తేస్తున్నారు. తాజాగా కర్ణాటకలో ఇలాంటి హైటెక్ మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో ఓ యాప్ సృష్టించామని, ఇందులో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు ఆర్జించవచ్చని ప్రచారం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నట్లు వీడియోలను సృష్టించారు. దీంతో దాదాపు 150 మంది పెట్టుబడులు పెట్టారు.
సైబర్ నేరస్తులు వారికి అమెరికా ప్రభుత్వం ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినట్లు నకిలీ పత్రాలను తయారుచేసి ఇచ్చారు. తొలినాళ్లలో లాభాలు వచ్చినట్లు చూపిస్తూ కొద్దిమొత్తంలో డబ్బులు తిరిగి ఇచ్చారు. ఇలా వారిని నమ్మించి మరింత సొమ్ము వసూలు చేశారు. మొత్తంగా రూ.కోటికి పైగా వసూలు చేసి ఫోన్లు స్విచ్ఛాప్ చేశారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.