నవతెలంగాణ-హైదరాబాద్: ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్లో తీవ్రస్థాయిలో నీటి కొరత నెలకొనడంతో రాజస్థాన్ ప్రజలు తీవ్ర ఇక్కట్లపాలవుతున్నారు. వేసవిలో గొంతెండుతున్నా.. ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు తాగడానికి మంచినీరందించడం లేదు. నీటి కొరతపై నిరసనగా రాజస్థాన్లోని కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం రాజధాని జైపూర్లోని జల్ భవన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కాంగ్రెస్ మాజీ మంత్రి ప్రతాప్ సింగ్ కచారియావాస్ నేతృత్వంలో జరిగింది. ఈ సందర్భంగా కచారియావాస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘తాగునీటిని అందించలేని ఏ ప్రభుత్వమైనా అసమర్థ ప్రభుత్వమే. తాగునీరు లేక ప్రజలు అవస్థలు పడుతుంటే.. పరిస్థితులకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించడంలో ప్రభుత్వం విఫలమైంది. 24 గంటల్లోగా జైపూర్లో నీటి సంక్షోభాన్ని పరిష్కరించకపోయినా, ప్రజలకు నీటి లభ్యత కోసం బిసాల్పూర్ నుంచి నీటి సరఫరాను పెంచకపోయినా ముఖ్యమంత్రి, మంత్రుల నీటి కనెక్షన్లను నిలిపివేస్తాం’ అని ఆయన హెచ్చరించారు.
ఈ ప్రభుత్వంలో ప్రజల మాట వినేవారు ఎవ్వరూ లేరు. ప్రజలు వీరికి అనుకూలంగా ఇన్ని ఓట్లు వేసి ఘోరమైన తప్పు చేశారు. ఈరోజు మేమంతా జల్భవన్ని ముట్టడించాము. ఆ తర్వాత ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ముట్టడిస్తాము అని కచారియావాస్ అన్నారు.



