తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరికలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రాం వంటి సోషల్ మీడియా వేదికలలో నకిలీ ఆన్లైన్ షాపింగ్ ప్రకటనల ద్వారా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) తెలిపింది. వీటి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ మేరకు టీజీసీఎస్బీ డీజీ శిఖా గోయల్ ఒక ప్రకటనను విడుదల చేశారు. సైబర్ నేరగాళ్లు బ్రాండెడ్ షూస్, ఎలక్ర్టానిక్స్, దుస్తులు, గాడ్జెట్స్, ఇన్సూరెన్స్ ఉత్పత్తులు, లగ్జరీ వస్తువులను భారీ డిస్కౌంట్లతో అందిస్తున్నట్టు నకిలీ ప్రకటనలు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నారని డీజీ పేర్కొన్నారు.
ఇలాంటి మోసాల్లో బాధితుల బ్యాంకింగ్, వ్యక్తిగత వివారాలు కూడా దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భారీ డిస్కౌంట్లు, ఫ్లాష్ సేల్స్, క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) సౌకర్యం లేకపోవడం, కొత్తగా సృష్టించిన సోషల్ మీడియా పేజీలు, నకిలీ రివ్యూలు, స్క్రీన్షాట్స్, ముందస్తు చెల్లింపుల కోసం ఒత్తిడి చేయడం, అనుమానాస్పద యూఆర్ఎల్లు, వెబ్సైట్లు వంటివి సాధారణ హెచ్చరిక సంకేతాలుగా డీజీ వివరించారు. చెల్లింపులు చేసే ముందు వెబ్సైట్ యూఆర్ఎల్లను జాగ్రత్తగా పరిశీలించాలనీ, తెలియని స్పాన్సర్డ్ యాడ్స్పై క్లిక్ చేయొద్దనీ, సురక్షిత పేమెంట్ మాత్రమే ఉపయోగించాలనీ, ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు ఎవరికీ పంచుకోవద్దని, అధికారిక వెబ్సైట్లతో ధరలను పోల్చాలని టీజీసీఎస్బీ ప్రజలకు సూచించింది. సైబర్ నేరాలకు గురైనవారు వెంటనే 1930కి కాల్ చేయాలనీ, cybercrime.gov.in లో ఫిర్యాదు నమోదు చేయాలనీ, డబ్బు బదిలీ అయితే వెంటనే బ్యాంక్ లేదా పేమెంట్ యాప్నకు సమాచారం ఇవ్వాలని పేర్కొంది.
నకిలీ ఆన్లైన్ షాపింగ్ ప్రకటనలతో జాగ్రత్త
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



