వెల్లడించిన ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి
ఏవీ కాలేజీలో పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సాహితి దశాబ్ది ఉత్సవాలు ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్లోని ఏవీ కాలేజీలో నిర్వహించనున్నట్టు తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి తెలిపారు. సోమవారం ఏవీ కాలేజీలో ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ రాజలింగం, నవతెలంగాణ పత్రికా సంపాదకులు ఆర్.రమేశ్లతో కలిసి దశాబ్ది ఉత్సవాల పోస్టర్ను ఆనందాచారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాహితి పదేండ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు ఐదు లిటరరీ ఫెస్టులు నిర్వహించామని గుర్తుచేశారు. ఆరో లిటరరీ ఫెస్ట్ను దశాబ్ది ఉత్సవాలుగా ఏవీ కళాశాల తెలుగు శాఖతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా డిగ్రీ, పీజీ విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ అనే అంశంపై కవితలు, వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నామనీ, ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. దశాబ్ది ఉత్సవాల్లో ప్రముఖ సాహితీవేత్తలు, ఇతర రాష్ట్రాల ప్రముఖులు హాజరు కాబోతున్నారని తెలిపారు. డాక్టర్ సీహెచ్. రాజలింగం మాట్లాడుతూ తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్ట్ను నిర్వహించే అవకాశం రావడం తమ కళాశాలకు గర్వకారణమన్నారు. విద్యార్థులకు సాహిత్యాన్ని చేరువ చేయడానికి ఇలాంటి ఉత్సవాలు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫెస్ట్లో తమ కళాశాల తెలుగు శాఖ పూర్తి భాగస్వామ్యం వహిస్తుందని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహితి రాష్ట్ర కోశాధికారి అనంతోజు మోహన్ కృష్ణ, సహాయ కార్యదర్శి ఎస్కే. సలీమ, ఏవీ కాలేజీ తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ జి.భాస్కర్ యాదవ్, భౌతిక శాస్త్ర విభాగ శాఖ అధ్యక్షులు మంజులాదేవి, రసాయన శాస్త్ర విభాగ అధ్యక్షులు అధ్యక్షులు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ సుధారాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్ హరిప్రియ, అధ్యాపకులు, కళాశాల యాజమాన్యం, విద్యార్ధిని విద్యార్థులు పాల్గొన్నారు.
21, 22 తేదీల్లో ‘తెలంగాణ సాహితి’ దశాబ్ది ఉత్సవాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



