– రెండంకెల వృద్థి లక్ష్యం : ఎల్ఐసి చైర్మెన్ సిద్ధార్థ వెల్లడి
న్యూఢిల్లీ : దిగ్గజ బీమా సంస్థ లైప్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) వచ్చే కొన్ని నెలల్లో 3-4 కొత్త బీమా ప్లాన్లను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. దీంతో నూతన ప్రీమియం వ్యాపారంలో రెండంకెల వృద్థిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ”మేము రెండంకెల వద్ధిని అంచనా వేస్తున్నాము. వ్యక్తిగత రిటైల్ వ్యాపారంలో ఇటీవలి పరిస్థితులు పురోగమిస్తున్నందున నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించబోతున్నాము. మా నిబద్ధతను మరింత బలోపేతం చేయడానికి, మేము కొన్ని కొత్త ఆకర్షణీయమైన ఉత్పత్తులను ప్రారంభించబోతున్నాము.” అని ఎల్ఐసి ఛైర్మన్ సిద్ధార్థ మొహంతి ఓ ఇంటర్యూలో తెలిపారు.
”డిసెంబర్ మొదటి వారంలో ఎల్ఐసి ఒక నూతన ప్లాన్ను ఆవిష్కరించనుంది. ఇది మార్కెట్లో పాలసీదారులను చాలా ఆకర్షించనుంది. ఇది హామీ ఇవ్వబడిన రాబడిని అందజేస్తుంది. మెచ్యూరిటీ తర్వాత పాలసీదారు జీవితకాల బీమా మొత్తంలో 10 శాతం పొందుతారు. ప్రతి ఒక్కరూ ఎంత చెల్లిస్తున్నారో..?, 20-25 సంవత్సరాల తర్వాత పొందే రాబడిని తెలుసుకోవాలని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న కొత్త ప్లాన్ మార్కెట్లో ఆదరణను పొందనుంది. దీనిపై అదనంగా రుణ సదుపాయం, ముందస్తు ఉపసంహరణ కూడా కొత్త ఉత్పత్తిలో ఫీచర్గా ఉండనుంది.” అని సిద్దార్థ తెలిపారు. పాలసీదారులు, వాటాదారుల ఆసక్తి మేరకు నూతన పాలసీలో గ్యారంటీ రిటర్న్స్ ఉండటంతో పాలసీదారులకు లబ్ధి చేకూరనుందన్నారు. తమ సంస్థలో పాలసీదారులే అధికంగా వాటాదారులుగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. కొత్త బిజినెస్ ప్రీమియంలో రెండంకెల వృద్థిని సాధించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సంలోనే మరో 2-3 పాలసీలను ప్రారంభించనున్నట్లు మహంతి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) ప్రథమార్థంలో ఎల్ఐసి కొత్త వ్యాపార ప్రీమియం ఆదాయం (వ్యక్తిగత) విభాగం 2.65 శాతం వృద్థితో రూ. 25,184 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్తో ముగిసిన ప్రథమార్థంలో ఎల్ఐసి రికార్డ్ స్థాయిలో రూ.17,469కోట్ల లాభాలు ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో రూ.16,635 కోట్ల లాభాలు నమోదు చేసింది.