నవతెలంగాణ-హైదరాబాద్: నకిలీ పత్రాలతో గండిపేటలో రూ.1500 కోట్ల విలువైన భూమి కబ్జాకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సహా కొందరు యత్నించారని శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. గండిపేట తహసీల్దార్ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. డీసీపీ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.
‘‘గండిపేట సర్వే నంబర్ 18లో భూమి కబ్జాకు నకిలీ జీవోలు సృష్టించినట్లు గుర్తించాం. నకిలీ పత్రాలు తయారు చేసిన నిమ్మల రాజేశ్ గౌడ్, వేణుగోపాల్, సాయికిరణ్లను అరెస్ట్ చేశాం. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేశ్ పరారీలో ఉన్నారు. ప్రభుత్వం భూమి క్రమబద్ధీకరించిందంటూ ఫేక్ జీవోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తహసీల్దార్ ఫిర్యాదుతో విచారణ చేపట్టాం. చట్టబద్ధ హక్కులు లేకుండానే భూమి అమ్మకానికి కుట్ర చేశారు.
ఎకరా రూ.3.5 కోట్లకు విక్రయించేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. కోర్టు ఆదేశాలతో నిందితుల ఇళ్లలో సోదాలు చేశాం. బ్యాంక్ పాసు పుస్తకాలు, మొబైళ్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నాం. ఈ అక్రమ భూ డీల్లో రూ.4కోట్లు చేతులు మారినట్లు గుర్తించాం. బొల్లా బ్రహ్మనాయుడి ఖాతా నుంచి రెండు విడతల్లో డబ్బు బదిలీ జరిగింది. ఆయన ఖాతా నుంచి రూ.1.25 కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించాం’’ అని డీసీపీ తెలిపారు.



