నవతెలంగాణ-హైదరాబాద్: పబ్లిక్ ఎగ్జామినేషన్(ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026ను కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. మంత్రి జితేందర్ సింగ్ సదురు బిల్లును సభ్యుల ముందు ఉంచారు.ఈ బిల్లును ఇప్పటికే లోక్సభ ఆమోదించగా.. గురువారం ఎగువసభలో దీనిపై సుదీర్ఘ చర్చ జరగనుంది. ఇటీవలి కాలంలో దేశంలోని పలు పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకల నేపథ్యంలో పరీక్షా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని నెలకొల్పడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని కేంద్రం చెబుతోంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంపొందించడం, ప్రశ్నపత్రాల లీకేజీలు, మోసపూరిత చర్యలు, ఇతర అక్రమాలకు పాల్పడే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లును రూపొందించారు.
పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026ను లోక్సభ బుధవారం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ బిల్లుపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ క్లుప్తంగా సమాధానమిచ్చిన అనంతరం ఈ ఆమోదం లభించింది. ఈ బిల్లుపై మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన సుదీర్ఘ చర్చ రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. బుధవారం నాడు తిరిగి చర్చ ప్రారంభమైంది. ప్రస్తుతం ఉన్న మూడేళ్లకు తక్కువ కాకుండా, ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు శిక్షను పొడిగించేలా పెంచాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. గరిష్ట జరిమానాను కూడా రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు.



