నవతెలంగాణ-హైదరాబాద్: లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయిల్ మరోసారి దాడి చేస్తే అది భీకర యుద్ధానికి దారి తీస్తుందని ఇరాన్ హెచ్చరించింది. ఈ విషయంలో తాము మౌనంగా ఉండబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి స్పష్టం చేశారు. ఇజ్రాయిల్ నుంచి వచ్చే ఏ చర్యకైనా ప్రతిస్పందించేందుకు తమ సాయుధ దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ తెలిపింది.
మరోవైపు, ఇరాన్ – అమెరికాల మధ్య దౌత్య చర్చలు కొనసాగుతున్నాయి. తుది ఒప్పందం కుదిరితే దానిని నాలుగు దశల్లో అమలు చేయనున్నారు. అయితే లెబనాన్ భద్రతను పక్కనబెట్టి ఎలాంటి ఒప్పందానికీ తాము అంగీకరించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్తో జరుగుతున్న చర్చలపై తాను ఆశాభావంతో ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
ఇరుపక్షాలు ఒప్పందంపై సంతకం చేసే దిశగా ముందుకు సాగుతున్నాయని, ఈ వారాంతానికి సానుకూల పరిణామాలు చోటుచేసుకోవచ్చని ఆయన అన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ఇరాన్ తన వద్ద ఉన్న సుసంపన్న యురేనియం నిల్వలను అమెరికాకు బదిలీ చేసే అంశం కీలకంగా మారిందని ట్రంప్ తెలిపారు. ఇదిలా ఉండగా ఇజ్రాయిల్, హిజ్బుల్లాల మధ్య ఘర్షణలను నిలిపివేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, ప్రాంతంలో యుద్ధ భయం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు.



