Monday, February 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆక్రమణలపై హైడ్రా పంజా

ఆక్రమణలపై హైడ్రా పంజా

- Advertisement -

చక్రపురి లేఔట్‌లో పార్క్‌ స్థలాలు, రోడ్ల నిర్మాణాలు నేలమట్టం
నవతెలంగాణ-అమీన్‌పూర్‌

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ ఆక్రమణలపై హైడ్రా పంజా విసిరింది. ఫలితంగా ఒకటీ కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.100 కోట్లు విలువ చేసే పార్కు స్థలాలు, రోడ్లను కబ్జాదారుల నుంచి విముక్తి చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ పరిధిలోని చక్రపురి కాలనీలో సర్వే నంబరులో 135లో 1253 గజాల పార్కు స్థలం కబ్జాకు గురయ్యింది. చక్రపురి కాలనీ హుడా లేఔట్‌ను 40 ఏండ్ల క్రితం ఏర్పాటు చేశారు. అయితే అందులోని రోడ్లతో పాటు పార్కు స్థలం, 30 మంది ప్లాట్లను కొంతమంది కబ్జా దారులు దర్జాగా కబ్జా చేశారు. ప్లాట్ల బాధితులు ఇదేంటని అడిగితే.. భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో ప్లాట్ల బాధితులు ఆరు నెలలుగా హైడ్రా అధికారుల చుట్టూ తిరిగి ఫిర్యాదు చేశారు. తాజాగా ఆ ఫిర్యాదుపై హైడ్రా స్పందించి ఆదివారం తెల్లవారుజామున 20 జేసీబీలతో కబ్జాకు గురైన నాలుగు ఎకరాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత స్థలంలోని అక్రమణల అడ్డంకులను తొలగించారు. దాదాపు 200 మంది సిబ్బంది కబ్జా అయిన భూములను స్వాధీనం చేసుకున్నారు. భవిష్యత్తులో మళ్లీ కబ్జాలకు అవకాశం లేకుండా ఫెన్సింగ్‌ వేసి భద్రత చర్యలు చేపట్టారు. కబ్జాలకు పాల్పడ్డ వ్యక్తులపై క్రిమినల్‌ కేసులు ఏర్పాటు చేస్తామని హైడ్రా, పోలీసు అధికారులు హెచ్చరించారు. హైడ్రా స్పందించిన తీరుపై స్థానిక ప్రజలు బాధితులు, హర్షం వ్యక్తం చేశారు. ఈ కూల్చివేతల్లో హైడ్రా సీఐ బాలగోపాల్‌, అమీన్‌పూర్‌ సిఐ నరేష్‌, అమీన్పూర్‌ జిహెచ్‌ఎంసి టౌన్‌ ప్లానింగ్‌ అధికారి పవన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -