మండల వ్యవసాయాధికారి శ్రీజ
నవతెలంగాణ – మల్హర్ రావు
రైతులు వరికొయ్యలను కాలిస్తే రూ.5 వేలు జరిమాన విధించడం జరుగుతుందని మండల వ్యవసాయాధికారి శ్రీజ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులు వరి కొయ్యలను కాల్చడం ద్వారా అపార నష్టం వాటిల్లుతుంది. భూసారం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదముంది. మంటల ద్వారా విపరీతమై వేడితో భూమి భూసారాన్ని కోల్పోతుంది. ముఖ్యంగా నత్రజని, పాస్పరస్ లాంటి పోషక పదార్థాల శాతం తగ్గి దిగుబడి తగ్గిపోతుంది భూమికి పదార్థంగా ఉపయోగపడే అవశేషాలు కాలిపోతాయని,పంటలకు అవసరమైన ఖనిజలవనాలు దెబ్బతింటాయిని, ఒక్కోసారి గాలి, మంటలు అధికంగా వ్యాపించి మనుషులను కోల్పోయిన ఘటనలున్నాయని, వ్యవసాయ సామగ్రి, పనిముట్లు ధ్వంసమైన సందర్భాలు సైతం ఉన్నాయని తెలిపారు.
కొయ్యకాలు నేలలో కలియదున్నడం వల్ల సేంద్రియ కర్బన శాతం పెరిగి దిగుబడులు 5 నుంచి 10శాతం పెరిగే అవకాశం ఉన్నదని,దుక్కిదున్నే సమయంలో సింగిల్ సూపర్ పాస్పేట్(ఎస్ఎస్.పి) చల్లితే అవశేషాలు రెండు వారాల్లో మునిగి పోషకాలుగా మారుతాయిని,ఫలితంగా డిఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది.మొక్కలకు 2శాతం నత్రజని (యూరియా) 4శాతం పాస్పరస్ అదనంగా అందిస్తుందిని,జింక్, మాంగనీస్, ఇనుము, కాల్షియం లాంటి సూక్ష్మ ధాతువులు పంటకు మేలు చేకూర్చుతాయని, నీటినిల్వ సామర్థం పెరుగుతుందన్నారు.వరి కొయ్యలను తగలబెట్టకుండా భూమిలో కలియదున్నడం ద్వారా సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది.వరికొయ్యకాలుకు నిప్పుపెట్టడం ద్వారా గాలి,నేల కలుషితమవుతుంది. పంటలకు మేలు చేసే మిత్ర పురుగులు మరణిస్తాయి. దున్నే ముందు తప్పనిసరిగా సింగిల్ సూపర్ ఫాస్పేట్ చల్లితే కొయ్యలు గడ్డి త్వరగా కుళ్ళిపోతాయని తెలిపారు. దీంతో ఎరువుగా మారి దిగుబడి కూడా పెరుగుతుంది. రసాయన ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించవచ్చు. ప్రతి క్లస్టర్ పరిధిలో వ్యవసాయ విస్తరణాధికారులు అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. రైతులు తమ సూచనలు పాటిస్తే తప్పకుండా మేలు జరుగుతుందన్నారు.



