– జేఎల్ఆర్ ప్లాంట్ను ప్రారంభించిన టాటా
చెన్నయ్ : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన లగ్జరీ విభాగమైన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జెఎల్ఆర్) కార్ల తయారీని తమిళనాడులో చేపడుతోంది. ఇందుకోసం నిర్మించిన అత్యాధునిక ప్లాంట్ను సోమవారం అధికారికంగా ప్రారంభించింది. రాణిపేట జిల్లా పనపాక్కం గ్రామంలోని సిప్కోట్ కాంప్లెక్స్లో 470 ఎకరాల భారీ విస్తీర్ణంలో సుమారు రూ.9,000 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ను ఏర్పాటు చేసింది. దీనిని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ లాంచనంగా ప్రారంభించి.. అక్కడే తయారైన మొట్టమొదటి రేంజ్ రోవర్ ఎవోక్ మోడల్ను స్వయంగా రోల్ అవుట్ చేశారు. రాష్ట్రంలోని ద్రావిడ మోడల్ పాలనపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి ఈ భారీ ప్లాంట్ ఒక నిదర్శనమని స్టాలిన్ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ఆటోమొబైల్ హబ్గా తమిళనాడు తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుందని.. టాటా గ్రూప్తో రాష్ట్రానికి ఉన్న బంధం దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన కొనియాడారు. భారతదేశాన్ని భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా స్థిరమైన, అధునాతన తయారీ కేంద్రంగా మార్చే ప్రయాణంలో ఈ ప్లాంట్ ఒక మైలురాయిగా నిలుస్తుందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. పారిశ్రామిక వృద్ధికి అండగా నిలుస్తున్న తమిళనాడులో తమ కార్యకలాపాలను విస్తరించడం గర్వకారణంగా ఉందన్నారు. రాబోయే 5 నుండి 7 ఏళ్లలో ఈ ప్లాంట్ ఏటా 2.5 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని చేరాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
తమిళనాడులో లగ్జరీ కార్ల తయారీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



