భారతీయ కళల పునర్జీవనం అనే సిద్ధాంతం బ్రిటీష్ వారి కళల పద్ధతికి వ్యతిరేకంగా, దేశమంతా పాకింది. ‘భారత్ ఛోడో, స్వదేశీ విప్లవం’ వంటి బలమైన ఆందోళనలు మొదలుపెట్టి, ప్రేరేపించి ఆ సిద్ధాంతంలో నడిచిన గాంధీ పుట్టిన గుజరాత్లో జరిగిన స్వదేశీ కళల గురించి తెలసుకోవటం అవసరం. గాంథీ పిలుపుకంటే ముందరే గుజరాత్లో కవితా సాహిత్యాల ద్వారా స్వదేశీ ప్రేమ, బ్రిటిష్వారికి విరుద్ధంగా ప్రస్తావనలు మొదలైనాయి. గుజరాత్, బ్రిటిష్ వారి బాంబే ప్రెసిడెన్సీలో భాగం. బాంబే, పూణా ప్రదేశాలు, మహారాష్ట్ర, పార్సీ సమూహాల సాంస్కృతిక, సామాజిక, రాజకీయ ప్రభావాలు గుజరాత్ మీద పడ్డాయి.
గుజరాత్లోని సూరత్ ప్రాంతంలో నర్మద్గా ప్రఖ్యాతి గాంచిన నర్మదా శంకరదవే (1833 – 1886), బొంబాయిలోని ఎలిఫంటా స్కూలు, కాలేజీలో చదువుకుని, ఇంగ్లీషు సాహిత్యం నుంచి కొంత ప్రభావితమయ్యాడు. ఈయన కవి, రచయిత, వక్త, సాహితీవేత్త. ఈయన ఆధునిక గుజరాత్ సాహిత్యాన్ని రాసిన మొదటి వ్యక్తి. సంఘసంస్కర్తగా ఎంతో పని చేశాడు. ఈయన రాసిన జై జై గర్వీ గుజరాత్ ఇక్కడి రాష్ట్రీయ గీతం. ఇక్కడి నుండే మహీపత్ నీలకాంత్ (1829 – 1891), నంద శంకర్ మెహతా (1835 -1905) వంటి సాహిత్య కారులతో పాటు దలపత్ రారు (1820- 1898) కనుమరుగౌతున్న మన జానపద కళల గురించీ రాశాడు. ఇలా గుజరాత్ సాహిత్య, సంఘసంస్కర్తలు ఎంతో పనిచేసిన ఈ ప్రాంతాన కొంత ఆలస్యంగా దృశ్యకళాకారులూ వారి దేశ ప్రేమ చాటారు. రవిశంకర్ రావల్ (1892 -1977) : భావనగర్లో జన్మించి 1910 నుండి 1919 వరకూ బొంబాయి జె.జె. కళాశాలలో దృశ్యకళ నేర్చుకున్నాడు. బొంబాయిలోని విస్తారమైన కళాప్రపంచాన్ని చూశాడు. అక్కడి నుండి వెనక్కి వచ్చి స్వదేశీ విప్లవానికి చురుకుగా పనిచేస్తున్న అహ్మదాబాద్లో వుండిపోయాడు. 1915లో గాంధీగారు అహ్మదాబాద్లో సబర్మతీ ఆశ్రమం స్థాపించి, ఖాదీ వడికి అది తన కర్మభూమిగా తెలిపారు. రవిశంకర్ గాంధీవాదిగా మారాడు.
రవిశంకర్ కళాకారుడు, కళల అధ్యాపకుడు. ‘కుమార్’ అనే పత్రిక ప్రచురించ మొదలుపెట్టి దానికి చిత్రాలు కూడా వేశాడు. ఈ పత్రిక సామాజిక, రాజకీయ, వైజ్ఞానిక, సాంస్కృతిక విషయాలతో పాటు కళలను కూడా ప్రచురించింది. ఎక్కడి విశేషాలైనా ప్రచురించాలంటే తానే పత్రకారుడిలాగా అక్కడికి వెళ్లి ఆ చిత్రాలు కూడా గీసి ఆ వార్తలు ప్రచురించేవాడు. రవిశంకర్ తన పని మొదలుపెట్టిన ఆ 20వ శతాబ్దపు మొదటి రోజులు, భారతీయ ఆదునిక కళలలో పునర్జీవన సిద్ధాంతం మొదలైన రోజులూ ఒకటే. చిత్రకారులు ఆ రోజులలో ఫొటోల నుండి పోట్రేటులు చిత్రించడం, లేదా వ్యక్తులను ఎదురుగా కూర్చోబెట్టి వారి పోట్రేటు చిత్రించడం, నాటక వేదికల వెనుక తెరలు చిత్రించడం, సినిమా పరిశ్రమ కోసం దృశ్యాలు చిత్రించడం, పుస్తకాలు, పత్రికల కోసం చిత్రాలు వేయడం, ముద్రణ కళల పని చేస్తుండేవారు. పాశ్చాత్యుల, భారతీయుల మధ్య వివాదాలు, భారతీయుల విప్లవాలు, రవిశంకర్ తన పత్రిక కుమార్లో ప్రచురించేవాడు. ఆ సమయాన రంజిత్రామ్ మెహతా (1882-1972) ‘గుజరాత్ని అస్మితా’ అని గుజరాత్ సంస్కృతి గురించి ఇచ్చిన వార్తాలాపాలు, కన్నయాలాల్ మున్షీ లాంటి వారిని కలవడం, గాంధీగారి స్వరాజ్య పోరాట పిలుపులు రవిశంకర్ని ప్రభావితం చేసి తను తన కళని జీవనాధారంగా పనులకు వుపయోగించే కంటే స్వదేశీ సిద్ధాంతంలో నడిపించి పని చేశాడు.
చిన్నతరంలో భగవాన్లాల్ మాస్టరు వద్ద భావనగర్లో రవిశంకర్ డ్రాయింగ్ నేర్చుకున్నాడు. భగవాన్లాల్ కూడా జె.జె.స్కూలు బొంబాయిలో చదువుకున్నాడు. భావనగర్ ఆస్థానంలో వున్న రవివర్మ చిత్రాలను, రవిశంకర్ తన జీవనాధారం కోసం కాపీలుగా చిత్రించేవాడు. భావనగర్ స్వదేశీ ప్రేమికులు చేసిన హస్తకళల ప్రదర్శన ఆ రోజుల్లో రవిశంకర్ని ఆకర్షించింది. ఈయన ఆపై బొంబాయి చదువు పూర్తిచేసి వచ్చి 1919లో కళామందిర్ అనే ఆర్ట్ స్కూల్ని అహ్మదాబాద్లో మొదలెట్టాడు. ఎన్నో చిత్రాలు వేశాడు. బహుమతులూ పొందాడు.
కనూదేశారు (1907-1980) : ఈయన భరూచ్లో పుట్టి ఆపై అహ్మదాబాద్కు చేరి అక్కడ నివసించాడు. మెట్రిక్యులేషన్ చదువు పూర్తయినాక ముందుకు చదువుకునే ఆసక్తి తగ్గి, 1920లో జరిగిన కాంగ్రెస్ సమ్మేళనానికి, స్వచ్చంద సేవకుడిగా చేరాడు. 1922లో రవిశంకర్ రావల్ వద్ద చిత్రకళ నేర్చుకున్నాడు. ఆపై గుజరాత్ విద్యాపీఠ్లో కళలు నేర్చుకున్నాడు. ముందర సినిమా పోస్టర్లు చూసి కాపీచేసేవాడు. రవిశంకర్ నేర్పగా ఎదురుగా చూసిన విషయాన్ని అవగాహనతో చిత్రం వేయడం నేర్చుకున్నాడు.
1925లో కనూ దేశాయిని శాంతినికేతన్ పంపగా అక్కడ 3 సంవత్సరాల పాటు శాంతనికేతన్, నందలాల్ బోస్ పద్ధతులు నేర్చుకుని వచ్చి గుజారాత్ విద్యాపీఠ్లో అధ్యాపకుడిగా చేరాడు. 1930 లో గాంధీగారి దండీమార్చ్లో ఇతనిని పంపి, ముఖ్యమైన సంఘటలను చిత్రాలుగా వేయించబడింది. ఆ చిత్రాలను కుమార్ పత్రిక ప్రచురించింది. ఈయన తన చిత్రాలను నలుపు తెలుపు చిత్రాలుగా చిత్రించాడు. తన చుట్టుపక్కల చూసిన జీవన విధానం, ప్రకృతి చిత్రించాడు. ఈయన సినిమాలంటే చాలా ఇష్టపడేవాడు. 1928 వరకు నలుపు తెలుపు చత్రాలే కాదు, నిశ్శబ్ద సినిమాలు కూడా అవి. వాటిని చూసి ప్రభావితమై వుండవచ్చు.
సోమాలాల్షా (1905 – 1994) : కాపడ్ వంజ్లో పుట్టిన ఈయన, 1924లో అహ్మదాబాద్ వచ్చి రవిశంకర్ రావల్ వద్ద కళలు నేర్చుకున్నాడు. గాంధీ పిలుపుకి కాలేజీ వదిలేద్దామనుకున్న ఈయనని, సలహా ఇచ్చి జె.జె. స్కూలు బొంబాయిలో కళలు అభ్యసించమని పంపాడు రవిశంకర్. కానీ అక్కడి చిత్రించే పద్ధతి నచ్చక, బరోడాలో ప్రమోద్ కుమార్ చటర్జీ వద్ద నేర్చుకోవటానికి వచ్చాడు. ఏడాది తరువాత కలకత్తా వెళ్లి అబనీంద్రుడి శిష్యుడు క్షితేంద్రనాథ్ వద్ద నీటిరంగుల చిత్రం బెంగాలు పద్ధతిన నేర్చుకున్నాడు. ఆపై ఈయనకు బొంబాయిలో ఉద్యోగం చేయాలని వున్నా, భావనగర్లోని దక్షిణామూర్తి ఆర్ట్ స్కూల్లో అధ్యాపకుడిగా చేరమని పంపాడు రవిశంకర్.
గాంధీగారి స్వదేశీ విప్లవ పోరాటం కళాకారులకు ప్రేరణనిచ్చింది. వారు ఆయన పిలుపునందుకుని, పురాణేతిహాసాల, చరిత్ర, పల్లెజీవితంపై చిత్రాలు వేశారు. సోమాలాల్కి బెంగాల్వారిలా నీటిరంగుల చిత్రం వేయటం ఇష్టమైనా, వారి పద్ధతిన కాక చిక్కటి రంగుల నీటి చిత్రాలు వేసేవాడు. బెంగాలు వారు పలుచటి రంగులు వేసి, వాటినీ నీటితో కడిగి మరింత పలుచని చిత్రం చిత్రించేవారు. ఈయనకు జంతువులు, పక్షుల చిత్రాలు వేయటం కూడా ఇష్టం వుండేది.
రసిక్లాల్ పారిఖ్ (1910 -1982) : 16 సంవత్సరాల కల్లా రవిశంకర్ రావల్కి శిష్యుడయ్యాడు. ఆపై మద్రాసులో డి.పి.రాయచౌదరి వద్ద చదువుకోవడానికి వెళ్లాడు. జె.జె.స్కూలు బొంబాయిలో జగన్నాథ్ ఆహివాసి వద్ద 1930 కల్లా కళాభ్యాసం పూర్తిచేశాడు. 1937లో కాంగ్రెస్ సమ్మేళనం కోసం నందలాల్ బోస్ వేసిన హరిపురా పోస్టర్ల చిత్రీకరణలో సాయం చేశాడు. రసిక్లాల్ బుద్ధుడి జీవితం మీద కొన్ని వరుస చిత్రాలు వేశాడు. అలాగే పల్లెజీవితం మీద చిత్రాలు వేశాడు. నందలాల్ బోస్ లాంటి చిత్ర విషయాలు ఈయన చిత్రాలలోనూ కనిపిస్తాయి కానీ, ఈయన చిత్రాలు బెంగాలు వారి పలుచటి నీటి రంగుల చిత్రాలు కాక చిక్కటి నీటి రంగుల చిత్రాలు వేశాడు.
ఛగన్లాల్ యాదవ్ (1903 -1987) : ఇతను పేద కుటుంబం నుండి వచ్చాడు. భావనగర్లోని విద్యాపీఠ్లో ఉచిత రాత్రి స్కూల్లో విద్య నేర్చుకుని అక్కడే అధ్యాపకుడిగా చిత్రకళ నేర్పాడు. కనూదేశారు నలుపు తెలుపు చిత్ర రచన నచ్చి అలా చిత్రం వేయ మొదలుపెట్టాడు. 1928లో రవిశంకర్ రావల్ కళాశాలలో చేరి కళలు నేర్చుకున్నాడు. 1930లో విద్యాపీఠ్ మూతపడింది. స్వదేశీ విప్లవంలో కారాగారం కూడా వెళ్లివచ్చాడు. ఆపై ఇండోర్, లక్నో వెళ్లి అక్కడి వారి కళాపద్ధతి నేర్చుకుని వచ్చాడు. ఇండోర్లో బింద్రే అనే మరో కళాకారుడితో స్నేహం అయింది. ఇండోర్ స్కూల్ వారు ప్రకృతి దృశ్యాలు చక్కగా వేస్తారు. బింద్రే పర్యటన శాఖవారి కోసం కాశ్మీరు దృశ్యాలు చిత్రించడానికి వెళ్లినప్పుడు ఇతను వెంట వెళ్లి చిత్రాలు వేశాడు. ఈయన చిత్రాలు కూడా 1939లో బింద్రేతో పాటు బొంబాయి ఆర్ట్ సొసైటీలో ప్రదర్శించబడ్డాయి. ఛగన్లాల్ రైతుల చిత్రాలు వేస్తూ వారు భూమి ఆకాశాల ఉపాసకులంటాడు.
మంగల్సింగ్ : కలాపి అనే ఒక కవి, భావనగర్ రాజవంశం వాడు. స్వదేశీ ప్రేమలో ఎన్నో కవితలు రాశాడు. ఆయన కవితల మీద రవిశంకర్ రావల్ ఎన్నో చిత్రాలు వేశాడు. ఆ కలాపికి మనుమడే ఈ మంగల్సింగ్. ఈయనా తాతకు మల్లే రాజవంశీయుడు అనే మాట కన్నా కళాకారుడినని ఆనందించాడు. వినాయక పండ్యా అనే చిత్రకారుడ్ని భావనగర్ రాజభవనంపై మ్యూరల్ చిత్రాలు వేయమని పిలిచినప్పుడు, ఆయన చిత్రణ పద్ధతి, ఆయన వద్ద తైల వర్ణ చిత్ర పద్ధతి నేర్చుకున్నాడు. తరువాత లండన్లో కళలు నేర్చుకోవటానికి వెళ్లి రెండవ ప్రపంచ యుద్ధమప్పుడు తిరిగి వచ్చి తన సంప్రదాయాలను, జానపద కళల ప్రభావంతో చిత్రించమొదలుపెట్టాడు.
ఖోడిదాస్ పర్మార్ (1930 -2004) : ఈయన గుజరాత్ స్వదేశీ పునర్జీవన కళల పరంపరలో 3వ తరం వాడు. భావనగర్ వాడు. వారి జానపద కళల పద్ధతిలో చిత్రం వేశాడు. అక్కడి స్త్రీలు చేసే కుట్టుపనుల నుండే ప్రేరణ తీసుకున్నాడు. గాంధీ జానపద కళల పునరుద్దరణ ఆలోచన ఈయనను ప్రభావితం చేసింది.
వాసుదేవ్ స్మార్ట్ (1925 -1999) : సూరత్లో పుట్టి బొంబాయి జె.జె.స్కూల్లో జగన్నాథ్ అహివాసి వద్ద చదువుకున్నాడు. అహివాసి మన సంప్రదాయ కళాపద్ధతులలో నిష్ణాత. వాసుదేవ్ వారణాసి వెళ్లి అక్కడి బెనారస్ హిందూవిశ్వవిద్యాలయంలోని స్త్రీల కళాశాలలో పనిచేశాడు. భారతీయ సంప్రదాయ కళల నుండి ఒక సరళమైన పద్ధతి ఏర్పరచుకుని, అలాంటి చిత్రాలు వేశాడు. ఈయన చిత్రాలు కథలు చెప్పినట్టు వుంటాయి. బెనారస్లో తను ఉద్యోగం చేస్తూ అక్కడి సంప్రదాయ లఘుచిత్రాల వైపు ధ్యాస పెట్టి చూడగలిగాడు. పురాతన మందిరాలపై వున్న అలంకరణ నమూనాలు ఒక పుస్తకంలా పొందుపరిచాడు. చక్కటి గీతలు బలమైన ఆకర్షణీయమైన రంగులతో చిత్రాలు వేశాడు. ఈయనకు మన కావ్యాల మీద కూడా ఎంతో అవగాహన వుంది. ఈయన కొడుకు జగదీప్ స్మార్ట్ కూడా కళాకారుడు, కవి. సూరత కళాశాలో అధ్యాపకుడిగా పనిచేశాడు. రవిశంకర్ రావల్ సూత్రధారిగా గుజరాత్లోని కళలు, కళాకారులు వృద్ధిచెందారు. గాంధీవాది రవిశంకర్ స్వదేశీ గుజరాత్ కళాకారులను, గుజరాత్ జీవన విధానాన్ని చిత్రాలలో చిత్రించేలా చేస్తూ ఆధునిక కళల వైపు అడుగు వేయిస్తూ ముందుడుగు వేశాడు. తనను నమ్మిన ఇంతమంది కళాకారులను ప్రేరేపించాడు. కానీ గుజరాత్ కళకారులు పెద్దగీత పక్కన చిన్న గీతలా గాంధీజీ అనే పెద్ద తరంగం పక్కన చిన్న తరంగంలా మిగిలిపోయారు.
డా||యం.బాలామణి, 8106713356



