నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని వార్డు నెంబర్ 18, లిమ్ర గార్డెన్ సమీపంలోని ప్రైమరీ స్కూల్ మరియు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్న పోలింగ్ స్టేషన్ నెం.55 లో బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనదని పేర్కొన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు చేరుకుని నిర్భయంగా ఓటు వేయాలని, స్థానిక సుపరిపాలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించామని తెలిపారు. దివ్యాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ర్యాంపులు నిర్మించడంతో పాటు వీల్చైర్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. ఎన్నికల సంఘం గుర్తించిన 17 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకదాన్ని వెంట తీసుకువచ్చి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.



