నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్జి జిల్లా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. కామారెడ్డి మున్సిపల్ కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర జిల్లా కలెక్టర్ సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన భద్రతా బందోబస్తు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, స్ట్రాంగ్ రూమ్ భద్రత, ప్రవేశ, నిష్క్రమణ మార్గాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలను సమగ్రంగా సమీక్షించారు. ఎటువంటి అంతరాయాలు లేకుండా కౌంటింగ్ సజావుగా సాగేందుకు చేపట్టిన ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటిస్తూ పారదర్శకంగా, నిష్పాక్షికంగా కౌంటింగ్ నిర్వహించబడుతోందని ఎస్పీ తెలిపారు.
భద్రతా వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేయాలని, ప్రతి దశలో అప్రమత్తత పాటించాలని అధికారులకు, పోలీస్ సిబ్బందికి సూచించారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు విధుల్లో నిబద్ధతతో కొనసాగాలని ఆదేశించారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, డీజేలు ఏర్పాటు చేయడం, బాణసంచా కాల్చడంపై పూర్తి నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు. ర్యాలీలు నిర్వహించాలనుకుంటే సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. గెలిచిన అభ్యర్థులు వారి అనుచరులు సంయమనం పాటిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, ప్రజలందరూ ఫలితాలను పరస్పర గౌరవంతో స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సజావుగా కొనసాగుతోందని ఎస్పీ పేర్కొన్నారు.



