టీకేఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ వలి
నవతెలంగాణ – ఆత్మకూరు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనారిటీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం వెంటనే ప్రభుత్వ మైనారిటీ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని తురక కాశ సంక్షేమ సంఘం (టీకేఎస్ఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ వలి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో వందలాది మంది పేద మైనారిటీ విద్యార్థులు ఇంటర్ పూర్తి చేసినప్పటికీ, ప్రత్యేక డిగ్రీ కళాశాల లేకపోవడంతో పైచదువులకు దూరమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక స్థోమత లేక ప్రైవేట్ కళాశాలల్లో చేరలేక చాలా మంది మధ్యలోనే చదువు మానేస్తున్నారని తెలిపారు.
మైనారిటీ విద్యార్థుల విద్యాభివృద్ధి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలని, చిన్నచూపు చూడటం సరికాదని సయ్యద్ వలి హితవు పలికారు. విద్యా హక్కు అందరికీ సమానమని, పేద మైనారిటీలకు ఉన్నత విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాబోయే 2026-27 విద్యా సంవత్సరంలోనే వరంగల్లో మైనారిటీ డిగ్రీ కళాశాల ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, సీతక్క (ధనసరి అనసూయ)లు ప్రత్యేక చొరవ చూపి నిధులు, అనుమతులు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల వందలాది మంది మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తుకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.



