నవతెలంగాణ – హైదరాబాద్ : క్రికెట్ అభిమానులకు ఐసీసీ కీలక అప్డేట్ అందించింది. 2027లో జరగనున్న పురుషుల వన్డే ప్రపంచకప్కు సంబంధించిన తేదీలు, వేదికల వివరాలను ప్రకటించింది. ఈ మెగా టోర్నీ అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల సంయుక్త ఆతిథ్యంలో జరగనుంది. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ఈ విషయాన్ని వెల్లడించింది. 2003 తర్వాత ఆఫ్రికా గడ్డపై వన్డే ప్రపంచకప్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో కథనం ప్రకారం టోర్నీలోని అత్యధిక మ్యాచ్లకు దక్షిణాఫ్రికానే ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తం 54 మ్యాచ్లలో దాదాపు 41 మ్యాచ్లు దక్షిణాఫ్రికాలోనే జరగనున్నాయి. ఇక, జింబాబ్వే మూడు వేదికల్లో 8 నుంచి 10 మ్యాచ్లను, నమీబియా మూడు మ్యాచ్లను నిర్వహించనున్నాయి. జింబాబ్వేలోని విక్టోరియా ఫాల్స్లో కొత్తగా నిర్మిస్తున్న ఫేల్ మోసీ-ఓ-తున్యా స్టేడియం ఈ ఏడాది చివరి నాటికి సిద్ధం కానుంది.
గత రెండు ఎడిషన్లలో 10 జట్లతో టోర్నీ జరగగా, ఈసారి పాత ఫార్మాట్ను తిరిగి తీసుకువస్తున్నారు. మొత్తం 14 జట్లు ఈ ప్రపంచకప్లో పాల్గొంటాయి. వీటిని ఏడు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూపు నుంచి టాప్-3లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ దశకు అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వేలకు పూర్తిస్థాయి సభ్య హోదాలో నేరుగా ప్రవేశం లభిస్తుంది. అయితే, నమీబియా మాత్రం క్వాలిఫైయింగ్ రౌండ్ల ద్వారా అర్హత సాధించాల్సి ఉంటుంది.



