రేపు శివకళ్యాణమహోత్సవం
నవతెలంగాణ – మల్హర్ రావు
మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొయ్యుర్ గ్రామపంచాయతీ పివినగర్ అటవీప్రాంతం, మానేరు ప్రక్కనున్న పురాతనమైన నైన గుళ్లుల్లో రేపు ఆదివారం మహ రామలింగేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా జరగనున్న శివ పార్వతుల కళ్యాణమహోత్సవానికి సర్వం సిద్ధమైనట్లుగా కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ, మాజీ జెడ్పిటిసి అయిత కోమల-రాజిరెడ్డి దంపతులు, ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.
ఈ కల్యాణాన్ని తిలకించడానికి అధిక సంఖ్యలో సందర్శకులు రావాలని కోరారు.ఐత కోమల రాజిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ప్రతి ఏటా మహ శివరాత్రి సందర్భంగా అంగరంగ వైభవంగా శివ పార్వతుల కళ్యాణం మనంగా నిర్వహిస్తున్నారు. ఐతే ఈ ఆలయం జైనుల కాలంలో గుట్టనే గుహలుగా తొలొచి అద్భుత శిలా కల్పాలను చెక్కి పరమేశ్వరున్ని ప్రతిష్టించారు. ఆలయం ముందు భాగంలో నాటి చిత్రకారులు చెక్కిన శిల్పకళ నైపుణ్య సంపద ఈ ఆలయాన్ని నిశితంగా పరిశీలిస్తే మనకు అవగతం అవుతుంది. జైనుల కాలంలో ప్రసిద్ధి చెందిన గుడులే నేడు కాలక్రమేనా నైన గుళ్ళుగా పిలువబడుతున్నాయని తెలుస్తుంది.
ఆలయం ముందు భాగంలో నాటి జైనుల కాలంలో చెక్కిన శాసన లిపి ఇప్పుటికి చెక్కుచెదరకుండా ఉంది. పచ్చని అడవి ప్రాంతంలో ప్రకృతి అందాల సోయగంలో అలలారే మహరామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏటా జరిగే మహ శివరాత్రి ఉత్సవాలకు పెద్దపల్లి – భూపాలపల్లి జిల్లాలోని మంథని మహదేవపూర్ భూపాలపల్లి, గోదావరిఖని, పెద్దపల్లి బేగంపేట, పర్కాల, కాటారం తదతర తదితర పట్టణాల్లోని, గ్రామాల్లోని భక్తజనం తండోపతండాలుగా వస్తుంటారు. ఈ ఏడాది కూడా ఆలయ కమిటీ సభ్యులు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.



