– సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో చిత్త సేకరణలో గ్రామపంచాయతీ పారిశుధ్య సిబ్బందికి సహకరించాలని సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ అన్నారు. ప్రజలు చెత్తను కాలనీలో ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఇంట్లోనే గతంలో గ్రామ పంచాయతీ ద్వారా అందించిన చెత్త బుట్టలో నిల్వ ఉంచాలన్నారు. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో కాలనీకి వచ్చే గ్రామపంచాయతీ చెత్త సేకరణ ట్రాక్టర్ లోనే ఇంట్లో నిల్వ ఉంచుకున్న చెత్తను వేయాలని కోరారు. ప్రజలు కాలనీల్లో మురికి కాలువల పక్కన చెత్త వేయడం వల్ల ఆ చెత్త కాస్త మురికి కాలువలో పడి మురికి నీరు ప్రవాహానికి అడ్డుపడుతుందన్నారు. తద్వారా మురికి నీరు నిల్వ ఉండడంతో ఈగలు దోమలు వృద్ధి చెంది ప్రజలు అనారోగ్యాల బారిన పడేందుకు దోహదమవుతుందని పేర్కొన్నారు.
ప్రజలు చెత్తను బయట వేయకుండా ఇంట్లో నిల్వ ఉంచుకోవడం వల్ల మురికి కాలువలు శుభ్రంగా ఉండి మురికి నీటి ప్రవాహం సవ్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇండ్లలో పెద్ద మొత్తంలో చెత్త పేరుకు పోతే గ్రామ పంచాయతీ పాలకవర్గంలో ఎవరికైనా సమాచారం అందిస్తే పంచాయతీ ట్రాక్టర్ పంపి పారిశుద్ధ సిబ్బందితో చెత్తను సేకరిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు మాత్రం ఆరుబయట చెత్త వేయకుండా గ్రామపంచాయతీకి సహకరించాలన్నారు. తద్వారా గ్రామాన్ని పరిశుభ్రత గ్రామంగా తీర్చిదిద్దడంలో సహకారం అందించాలని కోరారు. కాగా సోమవారం పలు కాలనీల్లో పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది చెత్త సేకరిస్తున్న తీరును, ప్రజల సహకారాన్ని ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్ స్వయంగా పర్యవేక్షించారు.



